జనగామ : మహిళల ఆరోగ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా మొత్తం1200 మహిళా క్లినిక్లను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గత మార్చి 8న (అంతర్జాతీయ మహిళా దినోత్సవం) 100 మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసుకొన్నామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మహిళా ఆరోగ్య క్లినిక్తో పాటు హెల్ప్డెస్క్ను ప్రారంభించారు. హాస్పిటల్లో అందుతున్న వైద్య సేవలను మంత్రి పరిశీలించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో మొదటి విడతలో రెండు మహిళా ఆరోగ్య కేంద్రాలు (స్టేషన్ ఘన్పూర్, ఇప్పగూడెం) ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు 2,564 మందికి పరీక్షలు చేసి 251 మందిని జిల్లా కేంద్రానికి రిఫర్ చేసినట్లు వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా ఈ రోజు మరొక 100 మహిళా ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర స్థాయిలో ప్రారంభించుకుంటున్నాం.
జిల్లాలో 5 మహిళా ఆరోగ్య కేంద్రాలు పాలకుర్తి, దేవరుప్పుల, లింగాల ఘన్పూర్, బచ్చన్నపేట, ధర్మకంచలో ప్రారంభించేందుకు అనుమతి రాగా.. నేడు పాలకుర్తిలో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ప్రతి మంగళవారం ఉమెన్ క్లినిక్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ క్లినిక్ల ద్వారా మహిళలకు ప్రత్యేకంగా టెస్టులు చేస్తారు.
57 రకాల పరీక్షలు చేసి చికిత్సతో పాటు ఉచిత మందులు అందిస్తారని మంత్రి పేర్కొన్నారు. కేవలం 24 గంటల్లోనే టెస్టు రిపోర్టులు రానుండగా.. ఇందుకోసం తెలంగాణ డయాగ్నస్టిక్ పోర్టల్లో ప్రత్యేక లింక్ను అందుబాటులో ఉంచనున్నారు. అన్ని వయస్సుల మహిళలకు ఉమెన్స్ ప్రత్యేక క్లినిక్లలో వైద్య సేవలు అందిస్తారని తెలిపారు.
కాగా, తమకు పోషకాహారం కింద కాకుండా రెగ్యులర్ వేతనాలు అందే విధంగా చూడాలని పలువురు ఆశా వర్కర్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ సుహాసిని, జిల్లా వైద్యాధికారి ప్రశాంత్, హాస్పిటల్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.