తొర్రూరు, సెప్టెంబర్ 25 : యువత ఆర్థికంగా ఎదగాలి. వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడాలి. వారు, వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో బతకాలి. కన్నతల్లి దండ్రులకు మంచి పేరు తేవాలి. అన్నదే నా సంకల్పం అందుకే నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగ శిక్షణ ఇవ్వడమే కాకుండా ఈ జాబ్ మేళాలు పెట్టి వారికి ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పిస్తున్నాను అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి సోమవారం ప్రారంభించారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం విశేషంగా కృషి చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికే లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. కొత్తగా మరో లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. నియామకాలు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రైవేటు రంగంలోనూ అద్భుత అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగులతోపాటు ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా మంచి జీతాలు అర్జిస్తున్నారు. అలాంటి అవకాశాలను స్థానికంగా యువతకు అందించాలన్న లక్ష్యంతో ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ జాబ్ మేళా నిర్వహించేందుకు ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (EGMM), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(DRDA), జనగామ, ఎర్రబెల్లి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో, డీఆర్డీవో, తదితరులు పాల్గొన్నారు.