Minister Errabelli | మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలోనే కొడకండ్ల మినీ టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో త్వరలో ఏర్పాటు చేయనున్న మినీ టెక్స్టైల్ పార్క్ స్థలాలను శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి పరిశీలించారు. అనంతరం అంబేడ్కర్ కాలనీ ఎదురుగా న్న ప్రభుత్వ స్థలం, రామవరం రోడ్డులో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు 20 ఎకరాల స్థలం అవసరం కాగా.. భవిష్యత్తు అవసరాల రీత్యా అంతకంటే ఎక్కువ స్థలాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అంబేద్కర్ నగర్ ఎదురుగా గల 50 ఎకరాల స్థలాన్ని పార్క్కి అప్పగిస్తే భవిష్యత్తులో టెక్స్టైల్ పార్క్ విస్తరణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని అన్నారు. అలాగే రామవరం రోడ్డులో గల పది ఎకరాల స్థలం, అదనంగా మరో చోట 18 ఎకరాల స్థలం కూడా టెక్స్టైల్ పార్కుకు అప్పగించాలని ఆలోచిస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఈ స్థలాలను పరిశీలిస్తున్నామని.. త్వరలోనే స్థలాల కేటాయింపు జరుగుతుందని చెప్పారు.
కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో ఇక్కడి ప్రజల కష్టాలు తీరనున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వేలాదిమందికి ఉపాధి దొరకడంతో వలస వెళ్లిన ప్రజలు తిరిగివచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పార్కు వల్ల చేనేత కార్మికులకే కాకుండా, చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఇతర వర్గాల ప్రజలకు కూడా ఉపాధి లభిస్తుందని అన్నారు.