హైదరాబాద్ : తెలంగాణ మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మరోసారి ప్రసంశించారు. ఛత్తీస్గఢ్ పర్యటనలో ఉన్న ఆయన దేశంలో వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అంటూ అభినందించారు. ఇంటింటికీ నల్లాల ద్వారా నీటిని ఇవ్వాలనే లక్ష్యానికి చేరువయ్యామని, దేశంలో ప్రతి ఇంటికీ మంచినీరు విజన్ త్వరలోనే నిజం కాబోతుందని ట్వీట్ చేశారు. తెలంగాణ తరహాలోనే వంద శాతం నల్లా కనెక్షన్లు ఇచ్చిన రాష్ట్రంగా గోవా, ఆ తర్వాత స్థానాల్లో పాండిచ్చేరి (87.32), హర్యానా (85.11శాతం), అండమాన్ నికోబార్ దీవులు (83.76) ఆరో స్థానంలో గుజరాత్ (81.63) ఉన్నాయన్నారు.
మిషన్ భగీరథ పథకాన్ని ప్రశంసించిన కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్కు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటింటికీ మంచినీటిని అందించిన ఘనత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కే దక్కుతుందని, ప్రజల కల సాకారం చేసిందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రం జల్శక్తి పథకం తీసుకొచ్చిందని.. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాలు పథకాలు ప్రారంభించాయన్నారు. పథకానికి ఇప్పటికే అనేక అవార్డులు, రివార్డులు వచ్చాయని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో స్వచ్ఛమైన శుద్ధి చేసిన, ఆరోగ్యవంతమైన నీటిని వంద శాతం ప్రజలకు అందిస్తున్నట్లు చెప్పారు.
నూటికి నూరు శాతం ఫ్లోరైడ్ రహిత నీటిని అందిస్తున్న ఘనత మిషన్ భగీరథదేనన్నారు. అత్యంత వెనుకబడిన, మారుమూల గ్రామాలకు సైతం మంచినీటిని అందిస్తున్నామని, ఇందుకు 45వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. ఇందులో రూ.8వేల కోట్లని ఆదా చేస్తున్నామన్నారు. గ్రామీణులకు ఒక్కొక్కరికి వంద లీటర్లు, పట్టణాల్లో ఒక్కొక్కరికి 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల చొప్పున నీటిని అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు. ప్రజలకు కృష్ణ, గోదావరి నదుల ద్వారా భూ ఉపరితల నీటిని అందించడం ద్వారా అత్యంత ఆరోగ్యకరమైన మంచినీటిని అందిస్తున్న రాష్ట్రం తెలంగాణేనన్నారు. ఈ శాఖను నిర్వహిస్తుందుకు తనకు గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.