హైదరాబాద్ : నిజాం నిరంకుశల పాలన, విస్నూరు దేశ్ ముఖ్కి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప పోరాట యోధు రాలు వీరనారి చాకలి ఐలమ్మ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె స్వగ్రామం జనగామ జిల్లా పాలకుర్తిలోని ఐలమ కాంస్య విగ్రహానికి పూల మాల వేసి, పుష్పాంజలి ఘటించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నాడు సంఘంగా పిలిచే కమ్యూనిస్టులతో చేయి కలిపి తన పొలాన్ని దేశ్ ముఖ్ గుండాల నుంచి ఐలమ్మ కాపాడుకుంది. వారు చేసిన ఆనాటి ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది అయిందని తెలిపారు. ఆ తర్వాత మలి దశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని గుర్తు చేశారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ చూపుతూ ఆనాటి దేశ్ ముఖులు, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించింది.
ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే.. మరోవైపు అమ్మలాగా ఉద్యమకారులకు అన్నం పెట్టి ఆదరించిన మహనీయురాలు అని ప్రశంసించారు. ఐలమ్మ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ సాధించారు. పరిపాలనలో సైతం ఉద్యమ స్ఫూర్తిని పాటిస్తున్నారు. అందుకే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా మారిందని పేర్కొన్నారు. ఐలమ్మ జయంతి, వర్ధంతిలను అధికారికంగా నిర్వహిస్తుండటం పట్ల సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.