హైదరాబాద్ : రైతులు పండించిన ధాన్యం ఆఖరి గింజ వరకు కొంటామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమవారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ప్రాథమిక రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, పెద్దవంగరలో ఐకేపీ, ప్రాథమిక రైతు సహకార కేంద్రాల ఆధ్వర్యంలో రెండు కేంద్రాలు, పాలకుర్తి మండలం కొండాపూర్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండాపూర్లో రూ.లక్షతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో దిగుబడి పెరిగిందన్నారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. ఏటా 3వేలకోట్లు నష్టం వచ్చినా భరిస్తూ కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వం సైతం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, పొరుగు రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల రైతులు తెలంగాణలో పుట్టనందుకు బాధపడుతున్నారన్నారు. రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలన్నారు. ఆయిల్ తదితర ప్రత్యామ్నాయ పంటలు వేయాలని, రూ.1.40లక్షల వరకు ఆదాయం వస్తుందన్నారు. నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా ఆయిల్ పామ్ నర్సరీ, ఫ్యాక్టరీ ఏర్పాటు చేయించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.