హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పథకాలతో ప్రజలకు నిత్యం పండుగేనని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలను శనివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలకు వచ్చిన మంత్రికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పువ్వులు చల్లుతూ, బతుకమ్మలు, డప్పు, మేళతాళాలతో స్వాగతం పలుకగా.. మంత్రి సైతం బతుకమ్మను ఎత్తుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో మహిళలకు చీరెలు పంపిణీ చేసి, తెలంగాణ ఆడబిడ్డలకు ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
స్వరాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే పండుగలను నిర్వహిస్తున్నదన్నారు. ఇంటింటికీ పెద్దన్నలా, ఆడబిడ్డలకు మేనమామలా బట్టలు పెట్టి.. పండుగలు నిర్వహించే సీఎంను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. ప్రభుత్వం ప్రజలకు బట్టలు అందజేయడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలకు సీఎం కేసీఆర్ బట్టలు పెట్టే ఆనవాయితీని కొనసాగిస్తున్నారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూ.46.96కోట్ల విలువైన 13.45లక్షలకుపైగా చీరెలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఆయా కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, వివిధశాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.