హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): 2019-20 యాసంగి సీజన్కు సంబంధించి సీఎమ్మార్ బియ్యం ఇవ్వని మిల్లర్లపై చర్యలకు పౌరసరఫరాల శాఖ ఉపక్రమించింది. జరిగిన మొత్తం నష్టాన్ని వారి నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలు జారీచేశారు. గడువు ముగిసినప్పటికీ 102 మంది మిల్లర్లు లక్షల టన్నులకు పైగా బియ్యంను ఎఫ్సీఐకి సరఫరా చేయలేకపోయారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ధాన్యం నిల్వలు లేని మిల్లర్ల నుంచి ఒక్కో టన్ను విలువ రూ. 31 వేలలో 25 శాతం, ఆ మొత్తానికి ఏడాదిపాటు 12 శాతం వడ్డ్డీ కూడా వసూలు చేయాలని నిర్ణయించింది. ధాన్యం నిల్వలు ఉన్నప్పటికీ బియ్యం ఇవ్వని మిల్లర్లకు వడ్డీ మినహాయింపు ఇచ్చి మిగిలిన మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించింది.