కొత్త గూడెం క్రైం, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): గడ్చిరోలిలో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్తుంబ్డేతో పాటు పలువురు కీలక సభ్యులు ఈ ఎన్కౌంటర్లో మరణించారు. మిలింద్ మృతిని పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. ఎన్కౌంటర్లో మరణించిన మొత్తం 26 మంది మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలు ఉన్నట్టు తెలిపారు. ఎల్గార్ పరిషత్ కేసులో మిలింద్ మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నారు. ఆయనపై రూ.50 లక్షల రివార్డు ఉంది. చనిపోయినవారిలో 16 మందిని గుర్తించారు. ఇంకా 10 మందిని గుర్తించాల్సి ఉంది. మిలింద్తో పాటు చనిపోయిన చాలా మంది నక్సలైట్లపై నగదు రివార్డు ఉంది. గ్యారపత్తిలో నక్సలైట్లు క్యాంపు వేస్తున్నట్టు తమకు నిఘా వర్గాల నుంచి రెండురోజుల ముందు సమాచారం అందిందని గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్ చెప్పారు. 300 మంది జవాన్లతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించామని, ఈ క్రమంలో దాదాపు 100 మంది నక్సలైట్లు అధునాతన ఆయుధాలతో సీ-60 కమాండోలు, భద్రతా బలగాలపై కాల్పులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఆరు ఏకే-47 గన్స్, తొమ్మిది ఎస్ఎల్ఆర్లు, ఒక ఇన్సాస్ రైఫిల్, మూడు 303 రైఫిళ్లు, ఒక పిస్తోల్, తొమ్మిది 12బోర్ రైఫిళ్లతో పాటు మావోయిస్టులకు సంబంధించిన ఇతర వస్తుసామాగ్రిని సీ-60 కమాండోలు స్వాధీనం చేసుకొన్నారు. ఇదిలా ఉండగా గ్యారపత్తి ఎన్కౌంటర్పై న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం సీపీఐ మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం – తూర్పు గోదావరి జిల్లాల కమిటీ ఆజాద్ పేరుతో లేఖ విడుదలైంది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని లేఖలో పేర్కొన్నారు.