Mark Zuckerberg : మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. తన ప్లాట్ఫాంలపై చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్ఏఎం), డీప్ఫేక్ కంటెంట్, నిర్వహణ లోపాలు అన్నింటికీ కలిపి జుకర్బర్గ్ బుధవారం కేంద్రానికి క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. మెటా ప్లాట్ఫాంలలో లోపాలపై ఆ సంస్థకు కేంద్రం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో సోషల్ మీడియాలో ప్రధాని వీడియో తొలగింపుపై కూడా కేంద్రం మెటాపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లోగా మెటా సీఈవో జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పాలని కేంద్రం డిమాండ్ చేసింది. జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పాలని, లేకుంటే చట్టబద్ధమైన రక్షణ కల్పించే క్లాజ్ (సేఫ్ హార్బర్ ప్రొటెక్షన్) కోల్పోతారని పార్లమెంట్ స్థాయీ సంఘం సూచించింది. దీనిపై చర్చించేందుకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో బుధవారం మెటా ప్రతినిధులు భేటీ అయ్యారు. ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. మెటా తరఫున సంస్థ చీఫ్ గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయెల్ కాప్లన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రధాని వీడియో తొలగింపుపై మెటా ప్రతినిధులు వివరణ ఇచ్చారు.
అభ్యంతరకర కంటెంట్ను ఎలా అనుమతించారంటూ కేంద్రం ప్రశ్నించింది. దీనిపై వివరణ కోరింది. 45 నిమిషాలపాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. సంస్థ తరఫున జరిగిన పొరపాట్లను ఆయన అంగీకరించారు. నిర్వహణా లోపాలపై విచారం వ్యక్తం చేసిన జుకర్బర్గ్.. మోదీతోపాటు, అన్నింటికీ క్షమాపణలు కోరారు.