కొండాపూర్: జ్ఞాపకాలను పదికాలాల పాటు పదిలంగా ఉంచడంతో పాటు భవిష్యత్తు తరాలకు వాటి మాధుర్యాన్ని అందిచగల గొప్పతనం ఫోటోగ్రఫీకి ఉందని ఎంఎల్సీ వాణిదేవి పేర్కొన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఫోటోగ్రఫీ ప్రదర్శనకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వాణిదేవి మాట్లాడుతూ పాత జ్ఞాపకాలను ప్రస్తుత, భవిష్యత్తు తరాలకు అందించేలా చేయగల గొప్పదనం ఫోటోగ్రఫీకి సొంతమన్నారు.
సుఖ, దుఃఖాలను, గడిచిన కాలాన్ని మరోసారి చూడగలిగేలా ఫోటోగ్రఫీ చేస్తుందన్నారు. మన చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యాన్ని మరింత అందంగా చూపడంలో ఫోటోగ్రాఫర్లను మించిన శక్తి లేదన్నారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మానవ దశలు, ప్రకృతి రమణీయతలను అద్భుతంగా ఫోటోగ్రఫీ చూపిస్తుందన్నారు. ప్రదర్శనలో పలువురు ఫోటోగ్రాఫర్లు తీసిన 100 చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు, ఆగస్టు 29వరకు ఫోటోగ్రఫీ ప్రదర్శన కొనసాగుతుందని ఆర్ట్ గ్యాలరీ నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మీ, ఎస్వీ ఫైన్ ఆర్ట్ కళాశాల ప్రిన్సిపాల్ అజిత, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, కమలాకర్, ఫోటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీ కళాశాలలో ఫోటోగ్రఫీ దినోత్సవం…
మాదాపూర్లోని ఎస్వీ ఫైన్ ఆర్ట్ కళాశాలలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ఎంఎల్సీ వాణిదేవి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందమైన జ్ఞాపకాలను పదిలంగా ఉంచగల గొప్పదనం ఫోటోగ్రఫీకి ఉందన్నారు. చుట్టు ఉన్న సమాజాన్ని అందంగా, అద్భుతంగా చూపగల గొప్పదనం ఫోటోగ్రఫీకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అజిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.