న్యూఢిల్లీ, డిసెంబర్ 2: ఒమిక్రాన్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై సంపూర్ణ నిషేధం విధించాలని లోక్సభలో విపక్షాలు కేంద్రప్రభుత్వాన్ని కోరాయి. బూస్టర్ డోసు వేస్తారా.. వేస్తే ఎప్పుడు వేస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, కట్టడి చర్యలపై గురువారం లోక్సభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా విపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. లక్షల మంది మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాయి. పీఎం కేర్స్ నిధులపై నిలదీశాయి. మరోవైపు, వివాదాస్పద డ్యామ్ సేఫ్టీ బిల్లుకు గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. లోక్సభ 2019లోనే ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే, గురువారం రాజ్యసభ ఆమోదం సమయంలో బిల్లుకు రెండు సవరణలు చేశారు. దీంతో బిల్లు మళ్లీ లోక్సభకు వెళ్లనున్నది. ప్రతిపాదించిన బిల్లు ప్రకారం.. దేశంలో గుర్తించిన కొన్ని డ్యాముల సంరక్షణ, నిర్వహణకు ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపాలని, పునఃపరిశీలించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ద్రవ్యోల్బణం, రైతుల సమస్యలపై చర్చకు రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిరాకరించడంతో టీఆర్ఎస్ సహా విపక్షాలు వాకౌట్ చేశాయి. విపక్షాల నేతలు రైతులకు మద్దతుగా నినాదాలు చేశారు.
దేశంలో 2020లో 3,66,138 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని దీంతో 1,31,714 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్రం తెలిపింది. గురువారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో మాట్లాడుతూ 2019లో 4 లక్షలకుపైగా ప్రమాదాలు చోటుచేసుకోగా 1.51లక్షల మంది మరణించారని వెల్లడించారు.