హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకొనేందుకు టీఎస్ఆర్టీసీ భారీ సంఖ్యలో బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. రూ.500 కోట్ల విలువైన 300 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ సరఫరా చేయనున్నది. ది మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ కంపెనీ అయిన ఎవ్రీ ట్రైన్స్ ప్రైవేటు లిమిటెడ్ (ఈవీఈవై)నకు ఈ మేరకు టీఎస్ఆర్టీసీ లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్వోఏ) ఇచ్చింది. ఈవీఈవై కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బస్సులను ఒలెక్ట్రా నుంచి సమకూర్చుకోనున్నది. ఒలెక్ట్రా మొత్తం 20 నెలల్లో 300 బస్సులను సమకూర్చి, 12 ఏండ్ల వరకు బస్సుల నిర్వహణను చూస్తుంది. ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్ టెక్ చైర్మన్ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ.. ఒలెక్ట్రా గ్రీన్ టెక్కు మరో ప్రతిష్ఠాత్మక ఆర్డర్ రావటం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ‘తెలంగాణ పౌరులకు అత్యాధునిక, కాలుష్యం వెదజల్లని ఎలక్ట్రిక్ బస్సులతో సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నాం. ఒలెక్ట్రా ఇప్పటికే హైదరాబాద్లో మూడేండ్లుగా సేవలు అందిస్తున్నది. ఈ బస్సులను సకాలంలో డెలివరీ చేసి పౌరులకు అత్యుత్తమ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తాం’ అని వెల్లడించారు. బస్సులో అమర్చిన లిథియం-అయాన్ బ్యాటరీని ఒకసారి చార్జ్ చేస్తే ట్రాఫిక్, ప్రయాణికుల లోడ్ పరిస్థితులను బట్టి 200 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అధికారులు పేర్కొన్నారు.