న్యూఢిల్లీ : ఈకామర్స్ సంస్ధ మీషో ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు పని నుంచి పూర్తి విరామం ఇస్తూ 11 రోజులు ఎంజాయ్ చేసే వెసులుబాటు కల్పించింది. కంపెనీ వెబ్సైట్లో ఈ బ్రేక్ను రీసెట్ అండ్ రీచార్జ్గా పేర్కొంది. ఇదే పోస్ట్ను మీషో వ్యవస్ధాపకులు, సీటీఓ సంజీవ్ బన్వల్ ట్విట్టర్లో షేర్ చేశారు.
వరుసగా రెండో ఏడాది రీసెట్ అండ్ రీచార్జ్ను ప్రకటించామని చెప్పారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్ట కంపెనీ తెలిపింది. కంపెనీ వ్యాప్తంగా ప్రకటించిన బ్రేక్ ఈ ఏడాది అక్టోబర్ 22 నుంచి నవంబర్ 1 వరకూ అమలవుతుంది. రానున్న పండగ సీజన్ దృష్టిలో ఉంచుకుని మీషో ఉద్యోగులు రిఫ్రెష్ అయ్యేందుకు ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. ఉద్యోగులే తమ ఆస్తి అని వారికి ఆమోదయోగ్యమైన పని ప్రదేశాన్ని కల్పిస్తూ మానసిక ఆరోగ్యం ప్రతిఫలించేలా తమ నిర్ణయాలు ఉంటాయని మీషో వెబ్సైట్ పేర్కొంది.
మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని పేర్కొంది. మీషో నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతించారు. ఇది ఇప్పుడు చాలా అవసరమని పలువురు యూజర్లు కామెంట్ చేయగా, ఇదే పద్ధతిని మరికొన్ని సంస్ధలు అందిపుచ్చుకుంటాయని ఆశిస్తున్నామని మరికొందరు నెటిజన్లు రాసుకొచ్చారు. మీలాంటి ఎంట్రెప్రెన్యూర్లు దేశానికి చాలా అవసరమని పలువురు మీషో నిర్ణయాన్ని ప్రశంసించారు.