కుమ్రం భీం ఆసిఫాబాద్ : త్వరలోనే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కూడా వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటాం. జిల్లాలో 60 కోట్ల రూపాయలతో అధునాతన దవాఖాన భవనాన్ని నిర్మించనున్నట్లు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. శుక్రవారం జిల్లాలో మంత్రి ఐకేరెడ్డి తో కలిసి హరీశ్ రావు పర్యటించారు.
జైనూర్, కెరమెరి దవాఖానలను తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలో 60 కోట్ల రూపాయలతో 340 పడకల దవాఖాన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు.
అరవై ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో 3 వైద్య కళాశాలలు ఉంటే తెలంగాణ ఏర్పడిన 7 సంవత్సరాల్లో 15 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు నూతన భవనాలను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను సందర్శించారు.
అలాగే కాగజ్నగర్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిర్వహింస్తున్న నిత్యాన్నదాన సత్రాన్ని సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.