ఎంసీహెచ్ అప్రోచ్ రోడ్డుకు రూ.1.20 కోట్లతో శంకుస్థాపన
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్, డిసెంబర్ 25 : మెదక్ పట్టణ శివారులోని పిల్లికోటాల్ సమీపంలో నిర్మిస్తున్న 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) దవాఖానను ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఇంజినీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం ఎంసీహెచ్ దవాఖాన అప్రోచ్ రోడ్డు పనులకు రూ.1.20 కోట్లతో శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంసీహెచ్ దవాఖాన గదులతో పాటు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుపేదలకు మెరుగైన వైద్యం అం దిస్తూ.. అందుకోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఎంసీహెచ్ భవనానికి రూ.18 కోట్లు మంజూరయ్యాయని, మెయిన్ రోడ్డు నుంచి దవాఖాన వరకు రోడ్డుకు రూ.1.20 కోట్లు మంజూరు కాగా, పనులకు శంకుస్థాపన చేశామన్నారు. నూతన హంగులతో ఎంసీహెచ్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజలతో పాటు మాతాశిశు సంరక్షణ కేంద్రంలో శిశువులకు వైద్య సదుపాయాలు అందించనున్నట్లు చెప్పారు. రెండెకరాల స్థలంలో పార్కును ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్ పాల్గొన్నారు.