పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలను యజ్ఞంలా నిర్వహించాలని, అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేసి విజయవంతం చేయాలని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. జూన్ 3 వ తేదీ నుంచి పల్లె, పట్టణ ప్రగతి ప్రారంభంకానున్న నేపథ్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అధికారులతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. విజిలెన్స్ బృందాలు ఎప్పటికప్పుడు పనితీరు నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తున్నాయని, కాబట్టి రాబోయే 20 రోజులు 24 గంటలు పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. పల్లెప్రగతి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని ఎంపీడీవోలను ఆదేశించారు. జూన్ 2న ప్రతి మండలం, మున్సిపల్ వార్డుల్లో తెలంగాణ గ్రామీణ, పట్టణ క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మెదక్, మే 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాల ప్రాధాన్యతను గుర్తించి అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములై విజయవంతం చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ కోరారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జూన్ 3 నుంచి చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పాటు త్వరలో చేపట్టబోయే హరితహారం కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాల అమలును విజిలెన్స్ బృందాలు నిశితంగా పరిశీలిస్తూ నివేదికలను ప్రభుత్వానికి అందజేస్తున్నాయని, కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉంటూ రాబోయే 20 రోజులు 24 గంటలు పనిచేయాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు.
పచ్చదనానికి ప్రాధాన్యతనిస్తూ జాతీయ, ప్రధాన, మండల రహదారుల వెంట పెద్ద మొక్కలు నాటాలని, అవెన్యూ ప్లాంటేషన్ను చక్కగా చేపట్టాలని తెలిపారు. ప్రతి షాపు దగ్గర దుకాణ యజమానులు మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టేలా చూడాలన్నారు. అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వైద్య కేంద్రాలు తదితర ప్రభుత్వ సంస్థలలో విరివిగా మొక్కలు నాటేలా చూడాలన్నారు. వైకుంఠధామాల నిర్మాణాలను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. వాటి చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. పల్లె ప్రగతి పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాల్సిందిగా ఎంపీడీవోలకు సూచించారు. ప్రతి మండలంలో స్థలాలను గుర్తించి బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలన్నారు.
మున్సిపల్ ప్రాంతాల్లో నర్సరీల సక్రమ నిర్వహణకు పంచాయతీ కార్యదర్శులను కేటాయించామని, వారి సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. జూన్ 2న ప్రతి మండలం, మున్సిపల్ వార్డుల్లో తెలంగాణ గ్రామీణ, పట్టణ క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా అమలయ్యేలా సంబంధిత అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమాలను మహాయజ్ఞంలా భావించి చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమసింగ్, జడ్పీ సీఈవో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్కుమార్, నర్సాపూర్ ఆర్డీవో వెంకట ఉపేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు.