నిజాంపేట, ఫిబ్రవరి 14: ప్రభుత్వ పాఠశాల విద్యను మరింత బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకువచ్చారు. ప్రస్తుతం నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు ‘మన ఊరు- మన బడి’ పేరుతో నూతన పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఎంపిక చేశారు. దీంతో మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కార్పొరేట్ స్థాయిలో విద్య అందనుండడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడం, ఆంగ్ల మాధ్యమంలో విద్యాభ్యాసం ప్రారంభం కానుండడంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
పదేండ్లుగా ఆంగ్ల విద్య..
నిజాంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 372 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సెక్షన్లుగా విభజించి ఆంగ్లంలో బోధిస్తున్నారు. కాగా, నిజాంపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పది సంవత్సరాల నుంచే 6 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఆంగ్ల బోధన ప్రారంభం కానున్నది. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ఆంగ్ల మాధ్యమంలో బోధన, సౌకర్యాలు మెరుగుపడనుండడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని, ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకంతో విద్యార్థులు పాఠశాలలో చేరుతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
ఆంగ్ల మాధ్యమంతో బంగారు భవిష్యత్తు
ఆంగ్ల మాధ్యమంలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. ఉద్యోగ అవకాశాల్లో వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుంది. పాఠశాలలో ప్రతి విద్యార్థికి అర్థమయ్యే విధంగా బోధిస్తున్నాం. ప్రస్తుతం విద్యార్థులు ఒకరినొకరు ఆంగ్లంలో మాట్లాడుకుంటుంటే మాతో పాటు వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యనందించడానికి ప్రభుత్వం చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు వరంగా మారింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– శ్రీనివాస్ చారి, ఇంగ్లిష్ ఉపాధ్యాయుడు
విద్యార్థుల సంఖ్య పెరిగింది.
సక్సెస్ పాఠశాల అయిన నిజాంపేట ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం 372 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిని చూసి మరి కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవాలనే ఆసక్తితో ఒక్క నిజాంపేట నుంచే కాకుండా చుట్టు ముట్టు గ్రామాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చి చదువుకుంటున్నారు. ఫలితంగా విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతున్నది. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థుల సమిష్టి కృషితో పాఠశాలను అభివృద్ధికి కృషి చేస్తున్నాము.
– రవీందర్రెడ్డి, గణిత ఉపాధ్యాయుడు
ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడం సులభం
ఒకప్పుడు ఇంగ్లిష్ పీరియడ్ బెల్ మోగిందంటే చాలు భయం వేసేది. ఆ భయాన్ని మా సార్లు పూర్తిగా తొలగించారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుకోవడం చాలా సులభం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా అన్ని పాఠశాలలో వచ్చే సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం మంచి పని. మా తమ్ముళ్లు, చెల్లెలు భవిష్యత్లో మాలాగే ఆంగ్లంలో చదువుకుంటారు.
– శివకుమార్, 10వ తరగతి విద్యార్థి
సీఎం సార్ నిర్ణయం చాలా మంచిది..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1-10 తరగతుల వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధనను ప్రవేశపెడుతామని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చాలా మంచిది. ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులు చెల్లించలేక పైసలకు అవస్థలు పడ్డ మా తల్లిదండ్రులను చూశాను. ఆంగ్ల మాధ్యమంలో బోధన ద్వారా మాలాంటి ఎంతో విద్యార్థులు ప్రభుత్వ బడులలో చదువుకుంటారు. భవిష్యత్లో మాకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
– నర్సింహులు, 10వ తరగతి విద్యార్థి