సిద్దిపేట, మార్చి 7: ‘ఒకప్పుడు విద్య రంగంలోకి రావాలంటేనే ఆంక్షలున్న పరిస్థితి నుంచి, నేడు విదేశాల్లో విద్య, ఉద్యోగాల్లో రాణించే స్థాయికి చేరుకున్నారు. ఇది అభినందించదగిన పరిణామం. మహిళల శ్రమను గుర్తించి, సమానత్వం గుర్తిస్తే ఆ దేశ జీడీపీ పెరిగే అవకాశం ఉన్నట్లు సర్వేల్లో వెల్లడైంది. అందుకే మహిళలు చదువుకు ప్రాముఖ్యతనిచ్చి, ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానత్వం సాధించవచ్చు. పురుషులతో సమానంగా నేడు మహిళలు పని చేస్తున్నారు. మహిళలు శక్తి స్వరూపిణులు.. ధైర్యానికి ప్రతీకలు..
అందుకే ధైర్యంగా ముందుకు సాగి మహిళలు విజయం సాధిస్తున్నారు’.. అని సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘మహిళ సాధికారిత.. సమానత్వం సాధనకు విద్యనే కీలక పాత్ర పోషిస్తుంది.. మహిళలు విద్యావంతురాలు అయితే సమాజంలో అన్నిరంగాల్లో పురుషులతో దీటుగా పోటీ పడవచ్చు.. మహిళల విద్యా.. అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. మరిన్ని వివరాలు ఆమె మాటల్లోనే..
మహిళలకు మీరిచ్చే సందేశం ఏమిటి?
ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో దీటుగా పోటీ పడుతున్నారు. ఎందులోనైనా రాణించగలమని అనేక మహిళలు మంది నిరూపించారు. నిరూపిస్తున్నారు కూడా. దేశంలో అత్యంత శక్తివంతమైన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరు పొందారు. అనేక మంది మహిళలు ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా తమ బాధ్యతలను చక్కగా నిర్వరిస్తున్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని, నేటి మహిళలు ముందుకు సాగాలి. ఇతరులకు ఆదర్శంగా ఉండేలా, 10మందిని పోషించేలా ముందుకెళ్లాలి. సంసారం అనే బండికి స్త్రీ,పురుషులు రెండు చక్రాలు.. అవి సాఫీగా ముందుకు సాగితేనే కుటుంబం బాగుటుంది. స్త్రీ, పురుషులిద్దరూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే సమాజం బాగుంటుంది. స్త్రీని సహనంలో భూదేవితో ‘క్షమయా ధరిత్రి’ అని పోల్చుతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులెదురైనా ధైర్యంగా ముందుకు సాగితే విజయ సాధించొచ్చు.
మహిళల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటి?
సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నది. మహిళల ఆర్థిక స్వావలంబన.. సమానత్వం.. సాధికారితకు పెద్దపీట వేసింది. నిరుపేద యువతుల పెండ్లిండ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తెచ్చింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10లక్షల 30వేల మంది ఆడబిడ్డల పెండ్లిండ్లకు సాయం అందించింది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు చేసుకుంటే కేసీఆర్ కిట్తో ఆదుకుంటున్నది. మహిళల ఆర్థిక సమానత్వం కోసం మహిళా స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసి, ఆర్థికంగా నిదొక్కుకునేందుకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నది. మహిళలకు స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఫలితంగా నేడు రాష్ట్రంలోని 32 జడ్పీల్లో 20మంది మహిళలకు చైర్పర్సన్ పదవులు దక్కాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మూడు జడ్పీ చైర్మన్ పదవులు మహిళలకు వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో నాలుగు చోట్ల మహిళలు పరిపాలిస్తున్నారు. నేడు రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. మహిళా సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు మహిళల పక్షాన నా కృతజ్ఞతలు.
ఒక ఉపాధ్యాయురాలిగా విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఏమిటి?
ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉంటూ సీఎం కేసీఆర్ స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లతోనే నేను జడ్పీ చైర్ పర్సన్ అయ్యాను. విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందని నేడు ప్రభుత్వం అనేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి, విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు ‘మన ఊరు-మన బడి’ తెచ్చి, కోట్లాది రూపాయలు కేటాయించింది. జడ్పీ చైర్మన్గా నేను గతంలో పని చేసిన శాఖకు నిధుల కేటాయింపునకు, ఆ రంగంలో భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్న. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు నాయకత్వంలో జిల్లా ప్రథమ పౌరురాలిగా ఉండటం గొప్ప అదృష్టంగా భావిస్తున్న.