మెదక్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-23లో భాగంగా ఈ నెల 26, 27 మళ్లీ డిసెంబర్ 3, 4 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్లో 18 ఏండ్లు నిండిన ప్రతి ఒకరూ ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ప్రతి బూత్ స్థాయి అధికారి సంబంధిత పోలింగ్ కేంద్రానికి ఉదయం 10:00 గంటలకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలన్నారు. జనవరి 1, 2023 నాటికి 18 ఏండ్లు నిండిన యువతను గుర్తించి ఫారం -6 ద్వారా ఓటరుగా నమోదు చేయాలని ఆదేశించారు. ఇందుకు బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి 18 ఏండ్లు నిండిన వారిని గుర్తించాలన్నారు. ట్రాన్స్ జెండర్లను గుర్తించి వారిని కూడా ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు.
అంగవైకల్యం ఉన్న ఓటర్లను గుర్తించి సదరం డేటా ద్వారా ఓటర్ జాబితాలో నమోదు చేయాలన్నారు. ఇంతకుముందు జాబితాలో ఉన్న వారిని, కొత్తగా నమోదైన వారిని మ్యాపింగ్ చేయాలన్నారు. ఓటరు జాబితాలో ప్రముఖుల పేర్లు తప్పిపోకుండా చూసుకోవాలని, ఒకవేళ లేనట్లయితే వారి పేర్లు నమోదు చేయాలని వికాస్ రాజ్ తెలిపారు. ఫామ్ -6తో ఓటర్ నమోదు, 6-ఆ ద్వారా ఆధార్ లింక్, ఫామ్ -7 ద్వారా మృతిచెందిన వారిని తొలగించడం, ఫామ్ -8 ద్వారా చిరునామా బదిలీ తదితర మార్పులు చేపట్టేందుకు ఫారాలు, బ్యానర్ తన వెంట పోలింగ్స్టేషన్ వద్ద అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ రేఖాంక్షలు, (లాగిట్యూడ్), అక్షాంశాలు (లాటిట్యూడ్స్)గా తప్పనిసరిగా క్యాప్చర్ చేయాల్నరు. సూపర్వైజర్లు ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.
ప్రతి సూపర్వైజర్ వారి పరిధిలో కనీసం 10 శాతం పోలింగ్ కేంద్రాలను సందర్శించి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని, ఈఆర్వో వారి పరిధిలో ఉన్న 10 పోలింగ్ కేంద్రాలు సందర్శించి, అన్ని అంశాలు పరిశీలించి అర్హత ఉన్న వారందరూ ఓటరు జాబితాలో నమోదైనదీ లేనిది పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అనంతరం అదనపు కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ ప్రతి బూత్ స్థాయి అధికారి సంబంధిత పోలింగ్ కేంద్రానికి తప్పనిసరిగా హాజరై సాయంత్రం 5 వరకు ఉండాలన్నారు. పంచాయతీలో టామ్టామ్ ద్వారా ప్రచారం చేయాలని డీపీవోకు, అంగన్వాడీ కార్యకర్తలు అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారికి సూచించారు. 18 ఏండ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్లు, సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.