మెదక్ అర్బన్, అక్టోబర్ 03: విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు ఇరాన్ దేశస్తులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఇరాన్ దేశానికి చెందిన కరీం, ఇవాజి నడేర్, బినియాజ్ బహమాన్ హైదరాబాద్ కోకాపేటలో హోటల్ గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గత నెల11వ తేదీన రామాయంపేటలోని చికెన్ సెంటర్ వద్దకు వెళ్లి తమ వద్ద విదేశీ కరెన్సీ ఉందని, మీ వద్ద ఎన్ని డబ్బులున్నాయని మాయ మాటలు చెప్పి రూ.95వేలు, ఇదే తరహాలో ఈనెల 1న చేగుంటలోని గ్యాస్ ఏజెన్సీలో రూ.17 వేలు దొంగలించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో రామాయంపేట సీఐ, ఎస్సై కలిసి టీమ్లుగా ఏర్పడి నిందితులు ఉపయోగించిన కారు నెంబర్ ఆధారంగా ఆదివారం వాహనాల తనిఖీలు చేపట్టగా నేషనల్ హైవే ఆద్యా హోటల్ వద్ద ఢిల్లీకి చెందిన డీఎల్ 06 సీజే 7714 కారులో వెళ్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి 850 అమెరికన్ డాలర్లు, రూ.30,50,000 ఇరాన్ కరెన్సీ, మూడు సెల్ఫోన్లు, పాస్పోర్టులు, డ్రైవింగ్ లైసెన్స్లను స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను నర్సాపూర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి తెలిపారు. సీఐలు, ఎస్సైలు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా కుష్నూర్ గ్రామానికి చెందిన ఆకాశ్కాంబ్లె, సురేశ్కాంబ్లె, వికాస్ చెడు అలవాట్లకుబానిసయ్యారు. తమ అలవాట్ల కోసం ఎలాగైనా డబ్బులు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొన్ని నెలల నుంచి నర్సాపూర్లో పెద్దమ్మకాలనీ, జగన్నథరావు కాలనీ, పోస్ట్ ఆఫీస్ కాలనీ, చుట్టుపక్కల గ్రామాలు అయిన అచ్చంపేట, రుస్తుంపేట గ్రామాలతో పాటు రామాయంపేట, శంకరంపేట్(ఆర్), కౌడిపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రి సమయాల్లో ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేసేవారు. ఈ దొంగతనాలను ఛేదించడానికి కేసులు నమోదు చేసిన పోలీసులు తూప్రాన్ డీఎస్పీ సారథ్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు.
గత నెల 28న నర్సాపూర్ చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తమ ముఠాలో ముగ్గురు (ఆకాశ్కాంబ్లె, సురేశ్కాంబ్లె, వికాస్) ఉన్నారని తెలిపారు. ఎలాగైన డబ్బులు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. ఆకాశ్కాంబ్లె, సురేశ్కాంబ్లెపైనా జిల్లాలోని వివిధ పోలీస్స్టేషన్లలో 11 కేసులున్నాయి. బీదర్, ఔరాద్ పోలీస్స్టేషన్ల పరిధిలోనూ వీరు దొంగతనాలు చేశారు. 2019-20లో ఆకాశ్ కాంబ్లె బాన్సువాడ, బీర్కూర్, నారాయణఖేడ్ పోలీస్స్టేషన్ పరిధిల్లో 16 దొంగతనాలు చేశారు. బాన్సువాడ పోలీసులు ఆకాశ్కాంబ్లెపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు పంపిచారు.
సురేశ్కాంబ్లె గతంలో చిక్కడపల్లి, మెదక్ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో 9 నేరాలు చేసి, జైలుకు వెళ్లాడు. మరో నిందితుడు వికాస్ పరారీలో ఉన్నట్లు వివరించారు. ఇద్దరి నిందితుల నుంచి ఆరు తులాల 4 గ్రాములు బంగారు, 1.6 కేజీల వెండి ఆభరణాలు, ఇనుపరాడ్, స్క్రూడ్రైవర్, కట్టింగ్ ప్లేయర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులను చాకచాక్యంగా ఛేదించిన రామాయంపేట్ సీఐ చంద్రశేఖర్రెడ్డి, ఎస్సై రాజేశ్, నర్సాపూర్ సీఐ షేక్లాల్మదార్, ఎస్సై గంగరాజును ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, తూప్రాన్ డీఎస్పీ యాదగిరి రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.