Medak | మెదక్, జనవరి 3(నమస్తే తెలంగాణ): పోలీసులు విధి నిర్వహణలో భాగంగా క్రమశిక్షణతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరిగా పాటించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ సూచించారు. శనివారం ఉదయం మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కవాతుకు ఆయన హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ను పరిశీలించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్బెల్ట్ ధరించి, నిర్ణీత వేగ పరిమితుల్లో వాహనాలు నడుపుతూ రోడ్డు భద్రత నియమాలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞను పఠనం చేశారు “నేను భారతదేశ పౌరుడిగా, మోటార్ వాహనాల చట్టంలో పొందుపరచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని, ఇతరుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని తోటి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని, రోడ్డు ప్రమాదాలు జరగకుండా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని, రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని, ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దృఢసంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను” అని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రసన్న కుమార్, రంగా నాయక్, సీఐలు మహేశ్, కృష్ణమూర్తి, ఎస్సైలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.