లక్షలాది గొంతులను తడుపుతూ..వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ .. కరెంట్ ఉత్పత్తి చేస్తూ వెలుగులు పంచుతున్నది సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు. ఈసారి విస్తారంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టుకు నెలరోజులకు పైగానే వరద కొనసాగింది. వరద తాకిడితో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో అధికారులు పలుమార్లు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అదే సమయంలో ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 7.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు టర్బయిన్లతో విద్యుదుత్పత్తి చేపట్టారు. ఇప్పటి వరకు 14.1 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. ఇది ప్రాజెక్టు చరిత్రలోనే మూడో అత్యధిక విద్యుదుత్పత్తి కావడం విశేషం. రానున్న రోజుల్లో గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించేందుకు ప్రభుత్వం పనులు చేపడుతున్నది. ఇది పూర్తయితే ప్రాజెక్టు ఏడాది పొడవునా జలకళతో ఉట్టిపడుతున్నది. తద్వారా మరింత విద్యుదుత్పత్తి జరిగే అవకాశం ఉంది.
పుల్కల్ రూరల్, అక్టోబర్ 22 : సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు ఈసారి దాదాపు నెలరోజులుగా ఆగకుండా వరద కొనసాగింది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్టు అధికారులు పలుమార్లు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదిలారు. ప్రాజెక్టు నుంచి పంటలకు నీరందించడంతో పాటు విద్యుదుత్పత్తి చేశారు. సింగూరు ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 7.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రెండు టర్బయిన్ యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఈ సీజన్లో ఇప్పటి వరకు 14.1 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. సెప్టెంబర్ చివరి వారం నుంచి సింగూరు ప్రాజెక్టుకు మహారాష్ట్రలోని ధనేగావ్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద ఉధృతి కొనసాగింది. దీంతో విద్యుదుత్పత్తి చేశారు. 2010-11 సంవత్సరంలో రికార్డు స్థాయిలో 25.6 మిలియన్ యానిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ఆ తర్వాత మళ్లీ 2000-2001లో 21.9 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ఈసారి నెలరోజులుగా వరద కొనసాగుతుండడంతో 14.1 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ఈ ప్రాజెక్టు విద్యుదుత్పత్తి కేంద్రం చరిత్రలో మూడో అతిపెద్ద ఉత్పత్తి ఇది కావడం విశేషం.
జల విద్యుదుత్పత్తి ఇలా..
23 ఏండ్ల నుంచి గణాంకాలను పరిశీలిస్తే 10 మిలియన్ల యూనిట్లు దాటి విద్యుదుత్పత్తి అయ్యింది నాలుగు సార్లు మాత్రమే. 2000-01 సంవత్సరంలో 21.9 మిలియన్ల ఉత్పత్తి అయ్యింది. 2006-07లో 10.7 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి, 2010-11లో 25.6 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి, 2011-12లో 13.8 మిలియన్ యూనిట్ల్ల ఉత్పత్తి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈసారి 14.1 మిలియన్ యూనిట్లను సాధించడం ద్వారా మూడో అత్యధిక ఉత్పత్తి జరిగిందని సింగూరు ప్రాజెక్టు జల విద్యుదుత్పత్తి కేంద్రం అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించేందుకు ప్రభుత్వం పనులు చేపడుతున్నది. సింగూరు నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నీరందించి జిల్లాను సస్యశ్యామలం చేస్తారు. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా గోదావరి జలాలతో సింగూరు ప్రాజెక్టు కళకళలాడనున్నది. తద్వారా సాగు, తాగునీటి గోస తీరనుండడంతో పాటు భారీగా విద్యుదుత్పత్తి జరిగే అవకాశం ఉంది.
రెండుసార్లు మినహా..
2015-16, 2019-20 సంవత్సరాల్లో సింగూరు ప్రాజెక్టులో నీళ్లు లేక పోవడంతో ఒక్క మిలియన్ యూనిట్ విద్యుదుత్పత్తి కూడా జరగలేదు. 2010-11 సంవత్సరంలో అత్యధికంగా 45 రోజుల పాటు విద్యుదుత్పత్తి జరిగింది. ఆ సంవత్సరం సాధించిన 25.6 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తే ఇప్పటి వరకు ఉన్న అత్యధిక రికార్డు. సంగారెడ్డి జిల్లాలోని 132 కేవీ ఫీడర్ల ద్వారా సదాశివపేట, జోగిపేటకు విద్యుత్ సరఫరా చేయడమే కాకుండా ఇక్కడి విద్యుత్ను జిల్లా అవసరాలకు వినియోగిస్తున్నాం.
-పాండయ్య, టీఎస్ జెన్కో(సింగూరు ప్రాజెక్టు)