ఉమ్మడి మెదక్ జిల్లాలో మద్యం షాపుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి.. గురువారం టెండర్ల ముగియగా, చివరి రోజూ రాత్రి వరకు ప్రక్రియ కొనసాగింది. ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. సంగారెడ్డిలో 111 షాపులకు గానూ 2310, మెదక్లో 49 దుకాణాలకు 829 దరఖాస్తులు, సిద్దిపేటలో 93 షాపులకు గానూ రాత్రి వరకు 1800 దరఖాస్తులు వచ్చాయి. రేపు(శనివారం) లక్కీడ్రా ద్వారా షాపులను కేటాయించనుండగా, ఎంత మందికి అదృష్టం దక్కనుందో చూడాలి.
మెదక్/సిద్దిపేట టౌన్/ సంగారెడ్డి, నవంబర్ 18 : వచ్చే రెండేండ్ల కాలానికి మద్యం దుకాణాల లైసెన్స్ కోసం ఆశావహుల నుంచి భారీ స్పందన వచ్చింది. చివరి రోజు మద్యం దుకాణాలను చేజిక్కించుకునేందుకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వేశారు. ఈ నెల 9న ప్రారంభమైన మద్యం టెండర్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది. ఈ సంవత్సరానికి మద్యం దుకాణ వార్షిక టర్న్ ఓవర్ ట్యాక్స్ని పది రేట్లకు పెంచగా, ఎక్సైజ్ ట్యాక్స్ బ్యాంక్ గ్యారంటీ రుసుం 25 శాతం అంటే రూ.50 లక్షల ఎక్సైజ్ టాక్స్కు రూ. 12.50 లక్షలుగా నిర్ణయించారు. పర్మి ట్ రూంలకు ఎటువంటి అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు.ఈ నెల 20డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు. మెదక్ ఎక్సైజ్ శాఖ కార్యాలయం, సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయం, సిద్దిపేట ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో అధికారులు దరఖాస్తులను స్వీకరించారు.
మెదక్ జిల్లాలో..
49 మద్యం దుకాణాలకు 829 దరఖాస్తులు వచ్చాయి. ఎక్సైజ్ శాఖకు రూ.16 కోట్ల 55 లక్షల ఆదాయం రాగా, 16 దుకాణాలు రిజర్వు అయ్యా యి. ఇందులో ఒకటి ఎస్టీలకు, ఆరు ఎస్సీలకు, తొమ్మిది గౌడ కులస్తులకు కేటాయించారు. జిల్లా పరిధిలో మూడు ఎక్సైజ్ స్టేషన్లు ఉండగా, మెదక్లో 17, నర్సాపూర్లో 17, రామాయంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 15 దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన పోతంశెట్పల్లిలో 44, హవేళీఘనపూర్ దుకాణానికి 23 దరఖాస్తులు వచ్చాయి.
సిద్దిపేట జిల్లా..
జిల్లా ఎక్సైజ్ శాఖ పరిధిలో గతేడాది వరకు జిల్లాలో 70 మద్యం దుకాణాలు ఉండగా, కొత్తగా 23 మద్యం దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో జిల్లాలో 93 మద్యం దుకాణాల కోసం గురువారం రాత్రి వరకు సుమారు 1800 దరఖాస్తులు వచ్చాయి. సిద్దిపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఐదు సర్కిళ్లు ఉన్నాయి. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబా ద్, చేర్యాల, మిరుదొడ్డి సర్కిళ్లలో 93 దుకాణాలకు ప్రభు త్వం అనుమతి ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఖజానాలో రూ.36 కోట్లు జమ అయ్యాయి.
సంగారెడ్డి జిల్లా..
బైపాస్ రోడ్డులోని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కార్యాలయ ఆవరణ దరఖాస్తుదారులతో సందడిగా మారింది. జిల్లాలో మొత్తం 111 వైన్స్లు ఉండగా 2310 దరఖాస్తులు రాగా, ప్రభుత్వానికి రూ.46 కోట్ల ఆదా యం వచ్చింది. అయితే అత్యధికంగా పటాన్చెరు స్టేషన్పరి ధిలోని అమీన్పూర్లో 53 దరఖాస్తులు వచ్చాయి. అత్యల్పంగా నారాయణఖేడ్ స్టేషన్ పరిధిలోని కల్హేర్ మండలం మాసాన్పల్లి దుకా ణానికి కేవలం 11 దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. కాగా, పట్టణంలోని పోతిరెడ్డిపల్లి ఎంఎల్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాలులో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు శనివారం డ్రా తీయనున్నారు.