మెదక్, నవంబర్ 9: ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ఖరారు చేసిన నేపథ్యంలో వైన్స్ దుకాణా ల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించినట్లు ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ ఎంఏ రజాక్ తెలిపారు. మంగళవారం మెదక్లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాత దుకాణాల గడువు ఈ నెలాఖరుతో ముగియనున్నదని, దీంతో నోటిఫికేషన్ విడుదల చేసిన సర్కారు ఎస్సీ, ఎస్టీలతోపాటు గౌడ కులస్తులకు రిజర్వేషన్లు అమలు చేసిందన్నారు. దరఖాస్తు ఫీజుతోపాటు రెండుసార్లు స్లాబ్లను కొనసాగించనున్నట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో ఈ ఏడాది 11 కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం 38 వైన్స్లు ఉండగా, మరో 11 జతకానున్నాయని చెప్పారు. ప్రభుత్వ విధివిధానాల ప్రకారం ఎస్టీలకు 1, ఎస్సీలకు 6, గౌడలకు 9 దుకాణాలను కేటాయించామని, 33 దుకాణాలు ఓపెన్ కేటగిరీ కింద దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.
పెరిగిన 11 షాపులు..
మెదక్ జిల్లాలో 38 షాపులు ఉండగా, తాజా గా మరో 11 షాపులను ప్రభుత్వం కేటాయించిందని ఎక్సైజ్ శాఖ ఈఎస్ రజాక్ తెలిపారు. మొ త్తం షాపుల సంఖ్య 49కి పెరిగిందన్నారు. మెదక్ ఎస్హెచ్వో పరిధిలో హవేళీఘణాపూర్, మంభోజిపల్లి, పొడ్చన్పల్లి, రామాయంపేట ఎస్హెచ్వో పరిధిలో నిజాంపేట, చిన్నశంకరంపేట, వెల్దుర్తి, చేగుంట, నర్సాపూర్ ఎస్హెచ్వో పరిధిలో కౌడిపల్లి, తూప్రాన్, కాళ్లకల్, దొంతి గ్రామా ల్లో కొత్త మద్యం దుకాణాలు ఏర్పాటు చేశామన్నారు.
ఫీజు ఖరారు..
మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజు జిల్లాలో రెండు స్లాబ్లుగా విధించారని ఈఎస్ రజాక్ తెలిపారు. 5వేల లోపు ఉన్న గ్రామాల్లో లైసెన్స్ ఫీజు రూ.50 లక్షలు, 5 నుంచి 50వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో 17 షాపులు రూ.50 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా, 32 షాపులు రూ.55 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. లక్కీ డ్రా 20వ తేదీన జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ సమక్షంలో నిర్వహిస్తామన్నారు. 21 ఏండ్లు నిం డిన వారు మాత్రమే వైన్స్ షాపులకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తుతో పాటు కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పకుండా జత చేయాలని సూచించారు. ఒక వ్యక్తి ఎన్ని వైన్స్ షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు, గౌడ కులస్తులకు కేటాయించిన షాపుల్లో ఆ కేటగిరీలకు చెందిన వారే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్, రామాయంపేట ఎక్సైజ్ స్టేషన్లలో మూడు కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. గతంలో నాలుగు స్లాబుల్లో లైసెన్స్ ఫీజును చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు నూతనంగా ఆరు స్లాబ్ల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఎక్సైజ్ సీఐ గోపాల్, టాస్క్ఫోర్స్ సీఐ సూర్యకృష్ణ పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 మద్యం దుకాణాలు
సంగారెడ్డి, నవంబర్ 9 : మద్యం దుకాణాలకు దరఖాస్తు స్వీకరణను ప్రభుత్వం ప్రారంభించిందని, ఈ నెల18 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ కేఏబీ శాస్త్రి తెలిపారు. మంగళవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయలంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 243 మద్యం దుకాణాలు ఉన్నాయని, ప్రస్తుత ప్రభు త్వ కొత్త పాలసీ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ఎస్టీలకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, గౌడ్లకు 15 శాతం చొప్పున రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా 50 మద్యం దుకాణాలు పెంచిందని, ఆ ప్రకారం మొత్తం 243 దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించి, ఈ నెల 20న కలెక్టర్ చేతుల మీదుగా లాటరీ తీసి దుకాణాలు కేటాయిస్తామన్నారు. కొత్తగా పెరిగిన దుకాణాలు జిల్లాల వారీగా సంగారెడ్డిలో 16, మెదక్లో 11, సిద్దిపేటకు 23 దుకాణాలను ప్రభుత్వం పెంచిందన్నారు.
అధిక టర్నోవర్స్లకు 10 శాతం రుసుం..
ఇప్పటి వరకు వ్యాపారంలో అధిక టర్నోవర్స్ చేసిన వారికి కేవలం 6.4శాతం రుసుం ఇచ్చేదని, ప్రస్తుతం కొత్త పాలసీ ప్రకారం 10 శాతానికి ప్రభుత్వం పెంచడంతో వ్యాపారులకు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఇచ్చిందని వెల్లడించారు. వ్యాపారం చేసే వారికి ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.