ఏడుపాయల వనదుర్గామాత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు.
పాపన్నపేట, డిసెంబర్ 5: పవిత్ర పుణ్య క్షేతమైన ఏడుపాయల వన దుర్గామాత సన్నిధి ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. సెలవు రోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గామాతకు బిడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కరోనా నిబంధనలు పాటించేలా ఆలయ ఈవో సార శ్రీనివాస్, ఇతర సిబ్బంది తగిన చర్యలు తీసుకున్నారు. పాపన్నపేట ఎస్సై సురేష్ ఏడుపాయలలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు చర్యలు చేపట్టారు.