మీర్పేట : వర్షాకాలం ( Monsoon ) లో ప్రజలకు ఇబ్బందులు పడకుండా శానిటేషన్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ( Sabitha Indra Reddy ) అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని బడంగ్పేట్ సర్కిల్, మీర్పేట్ డివిజన్లో ఉన్న మిథిలానగర్లో కొనసాగుతున్న ఎస్ఎన్డీపీ( SNDP ) నాలా అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు.
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసు కున్నారు. మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్లు, అధికారులకు సూచించారు.నాలా పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.
డ్రైనేజీ వ్యవస్థలో పేరుకుపోయిన చెత్తాచెదారం, మట్టిని తొలగించి వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, శానిటేషన్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.ఆమె వెంట అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు , నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.