న్యూఢిల్లీ : ఐటీలో నైపుణ్యాలు కలిగిన యువతకు ఆకర్షణీయ జాబ్ ఆఫర్లు అంటూ మోసగిస్తున్న ఫేక్ జాబ్ రాకెట్లు, ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) యువతను కోరింది. ఐటీ ఉద్యోగాల పేరిట నకిలీ జాబ్ రాకెట్ల దందాకు సంబంధించి ఎంఈఏ శనివారం మార్గదర్శకాలను జారీ చేసింది. కొద్దిరోజుల కిందట మయన్మార్లో చిక్కుకున్న భారతీయుల వీడియో బహిర్గతమైన నేపధ్యంలో ఎంఈఏ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.
థాయ్లాండ్లో డిజిటల్ సేల్స్, మార్కెటింగ్లో ఆకర్షణీయ జాబ్ ఆఫర్ల పేరుతో నకిలీ జాబ్ రాకెట్స్ నడుస్తున్న విషయాన్ని ప్రస్తావించింది. విదేశాల్లో ముఖ్యంగా థాయ్లాండ్లో డేటా ఎంట్రీ జాబ్ల పేరుతో ఐటీ నైపుణ్యాలున్న యువతను టార్గెట్గా చేసుకుని దుబాయ్, భారత్కు చెందిన ఏజెంట్లు సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ఫేక్ జాబ్ రాకెట్ నడుపుతున్నారని హెచ్చరించింది. సరిహద్దుల గుండా బాధితులను మయన్మార్ తీసుకువెళ్లి అక్కడ వారితో కఠిన పరిస్ధితుల మధ్య బలవంతంగా పనులు చేయిస్తున్నారని తెలిపింది.
సోషల్ మీడియా వేదికలు, ఇతర మార్గాల్లో ముందుకొచ్చే ఇలాంటి నకిలీ జాబ్ రాకెట్ల వలలో పడరాదని ఎంఈఏ మార్గదర్శకాల్లో యువతను కోరింది. ఉద్యోగ నిమిత్తం టూరిస్ట్ వీసా, విజిట్ వీసాలపై విదేశాలకు వెళ్లే ముందు ఆయా దేశాల్లోని రాయబార కార్యాలయాల ద్వారా విదేశీ సంస్ధలు, యజమానుల గురించి ఓసారి చెక్ చేసుకోవాలని భారత పౌరులకు సూచించింది.