బిడ్డకు జన్మనివ్వటం ద్వారా స్త్రీ మాతృత్వ హోదాను అందుకోవటమే కాదు.. మానవజాతి కొనసాగింపునకు దోహదపడుతుంది. ఈ ప్రాధాన్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు కాబట్టే.. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే గర్భవతులు, బాలింతలు, నవజాత శిశువుల ఆరోగ్యానికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. ఎవరూ ఊహించని అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఈ సమగ్ర చర్యల ఫలితంగా నేడు మన రాష్ట్రం బాలింతల మరణాలను తగ్గించటంలో గొప్ప పురోగతి చూపిస్తున్నది. కేంద్రప్రభుత్వం విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సర్వే’ దీనికి నిదర్శనం.
ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు తెలంగాణలో సహజ ప్రసవాలుగానీ, ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులుగానీ చాలా తక్కువ. ప్రైవేటు దవాఖానలు లాభాల దృష్టితో కడుపుకోతకే (సిజేరియన్కు) మొగ్గు చూపేవి. ఇది తల్లులకు ఆరోగ్యపరంగానే కాదు, ఆ కుటుంబానికి ఆర్థికంగా కూడా సమస్యలు సృష్టించేది. అరకొర నిధులతో, అజమాయిషీ లేని విధానాలతో ప్రభుత్వ వైద్యవ్యవస్థ కునారిల్లిన పరిస్థితి ఆనాటిది. ప్రజారోగ్యరంగాన్ని సమూలంగా మార్చటానికి సంకల్పించిన సీఎం కేసీఆర్ గర్భిణులు, బాలింతలు, శిశువుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గర్భవతులకు ప్రతి రోజూ పౌష్టికాహారం అందించే ఆరోగ్యలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ‘అమ్మ ఒడి’ పేరు తో వాహనాలను ప్రవేశపెట్టారు. ఇవి గర్భిణులను నెలనెలా క్రమం తప్పకుండా సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు పరీక్షల కోసం ఉచితంగా తీసుకెళ్లి, తిరిగి ఇంటి వద్ద దింపుతాయి. ప్రసవానికి ముందు, ఆ తరువాత కూడా సేవలందిస్తాయి.
కేసీఆర్ మానసపుత్రిక ‘కేసీఆర్ కిట్’. ఇది ఎంత ప్రజాదరణ పొందిందంటే.. తెలంగాణలో ప్రభుత్వ దవాఖానల సముద్ధరణకు సమున్నత సంకేతంగా నిలిచింది. బాలింతకు, బిడ్డకు అవసరమైన 16 నాణ్యమైన వస్తువులతో కూడిన ఈ కిట్ను ప్రభుత్వ దవాఖానలో ప్రసవించిన ప్రతి తల్లికి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు, మగబిడ్డ పుడితే రూ.12 వేలను తల్లి బ్యాంకు ఖాతాలో ప్రోత్సాహకంగా జమ చేస్తున్నారు. ప్రైవేటు హాస్పిటల్కు పోతే వేలకువేల ఖర్చు, పైగా సహజ ప్రసవం జరిపే అవకాశాలు తక్కువ. ప్రభుత్వ దవాఖానకు వెళ్తే ఖర్చు లేకపోగా ఆర్థికసాయం, కిట్ బహుమతి, సహజ ప్రసవానికి అనుకూలత. దీనివల్లే ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 2014తో పోల్చితే రెట్టింపు అయ్యాయి. తల్లీబిడ్డల కోసం ప్రత్యేకంగా మాతాశిశు సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జిల్లా దవాఖాలన్నింటిలో ఆపరేషన్ థియేటర్లున్న మెటర్నిటీ వార్డులను నెలకొల్పింది. ఈ అంశంలో కేంద్రప్రభుత్వ ప్రమాణాలతో ‘లక్ష్య’ సర్టిఫికెట్ పొందిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. వీటన్నింటి వల్లే రాష్ట్రంలో బాలింతల మరణాలు 2014లో ఉన్న 92 నుంచి ఇప్పుడు 43కు తగ్గాయి (ప్రతి లక్షమందిలో). కొత్త తరానికి స్వాగతం పలికే విషయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది.