గుమ్మడిదల, జూన్ 8: ప్రభుత్వం భవన నిర్మాణ రంగం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తాపీమేస్త్రీల సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లిలో జాతీయ రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో బొంతపల్లి, దోమడుగు, గుమ్మడిదల, అన్నారం తదితర పట్టణాల్లో పనిచేస్తున్న భవన నిర్మాణ రంగం కార్మికులు, తాపీమేస్త్రీలు, సెంట్రింగ్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తాపీమేస్త్రీలు, నిర్మా ణ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు చలో ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టినట్లు తెలిపారు.
కార్మిక సంక్షేమ బోర్డును బలోపేతం చేసి నిర్మాణ రంగం కార్మికులకు సంక్షేమ పథకాలు, బీమా, పింఛన్, ఆరోగ్య భద్రత వంటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ధర్నా కోసం ఇందిరాపార్క్కు తరలివెళ్లారు. కార్యక్రమంలో మణికంఠ తాపీమేస్త్రీల సంఘం అధ్యక్షుడు బెల్లంకొండ నారాయణ, శ్రీనివాసులు, గోవింద్, కుమార్, ఢిల్లేశ్వర్రావు, కోటయ్య, లక్ష్మణ్రావు, శేషగిరి, తాపిమేస్త్రీలు, కార్మికులు పాల్గొన్నారు.