న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ ఆర్థిక ఫలితాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ.1,875.80 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.1,241.10 కోట్లతో పోలిస్తే ఇది 51.14 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా రూ.24,034.50 కోట్ల నుంచి రూ.26,749.20 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది.
-గత త్రైమాసికంలో సంస్థ 4,88,830 వాహనాలను విక్రయించింది. అంతక్రితం ఏడాది విక్రయించిన వాటితో పోలిస్తే కేవలం 0.7 శాతం పెరిగాయి. వీటిలో దేశీయంగా 4,20,376 యూనిట్లు, 68,454 యూనిట్లను ఇతర దేశాలకు ఎగుమతి చేసింది.
‘కరోనా సెకండ్ వేవ్, చిప్ల కొరత, కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. సెమికండక్టర్ల కొరతతో ఉత్పత్తి భారీగా నిలిచిపోయింది. కేవలం మారుతియే కాదు మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. చిప్ల కొరతతో ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 880 మిలియన్ డాలర్ల నుంచి 350 మిలియన్ డాలర్లకు పడిపోయింది. మానెసర్ ప్లాంట్ సామర్థ్యాన్ని మరో లక్ష యూనిట్లు పెంచడానికి రూ.161 కోట్ల మేర పెట్టుబడి పెడుతున్నాం’
– ఆర్సీ భార్గవ, మారుతి సుజుకీ చైర్మన్