Maruti Suzuki Price Hike | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు కార్ల ధరలు పెంచేసింది. ఇన్పుట్ కాస్ట్స్ పెరిగాయని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అన్ని రకాల కార్ల ధరలు 4.3 శాతం వరకు పెరుగుతాయని తెలిపింది. జనవరిలో కార్ల ధరలు పెరుగుతాయని గత నెలలోనే రెండో తేదీనే సంకేతాలిచ్చింది. సగటున 1.7 శాతం కార్ల ధరలు పెరుగుతాయని స్టాక్ ఎక్స్చేంజ్లకు ఇచ్చిన నోటీసులో తెలిపింది.
సాధారణంగా క్యాలెండర్ ఇయర్ ప్రారంభంలో కార్ల తయారీ సంస్థలు ధరలు పెంచుతుంటాయి. కానీ ఇన్పుట్ కాస్ట్ పెరిగిందని, రవాణా చార్జీలు పెరిగాయని కార్ల తయారీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు దఫాలు ధరలు పెంచాయి. ఇలా మారుతి కార్ల ధరలు పెంచడం అధికారికంగా మూడోసారే.. కానీ జూలైలో పాపులర్ మోడల్ స్విఫ్ట్, సీఎన్జీ వేరియంట్ కార్ల ధరలు రూ.15 వేల వరకు పెంచేసింది. దీని ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి ధరలు పెంచడం ఇది నాలుగోసారి.
గత ఏప్రిల్లో ఎంపిక చేసిన కార్లపై 1.6 శాతం, సెప్టెంబర్లో 1.9 శాతం, స్విఫ్ట్తోపాటు సీఎన్జీ వేరియంట్ కార్లపై రూ.15వేల వరకు పెంచిన మారుతి ఈ దఫా ఏకంగా 4.3 శాతం ధరలు పెంచేయడం గమనార్హం. ఒక ఏడాదిలో 7.8 శాతం ధరలు పెరిగాయి. ఇంకా మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, ఫోక్స్ వ్యాగన్ తదితర దేశీయ కార్ల తయారీ సంస్థలు ఈ నెల ఒకటో తేదీ నుంచే ధరల పెరుగుదల అమల్లోకి తెస్తున్నట్లు ఇంతకుముందే ప్రకటించాయి.
కార్ల తయారీలో ఉపయోగించే లోహాల ధరలు ఏడాది కాలంగా పెరిగిపోవడంతో ఆయా సంస్థల లాభాలు తగ్గుముఖం పట్టాయి. అధిక ఇంధన ఖర్చులు, ప్రపంచవ్యాప్తంగా పోర్టులు స్తంభించడం వల్ల రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. టెక్నాలజీతో కార్ల తయారీ అనుసంధానం పెరిగిపోయింది ఇప్పుడు. కానీ కరోనా తర్వాత చిప్లు, సెమీ కండక్టర్లకు కొరత ఏర్పడింది. ఫలితంగా కార్ల తయారీ సంస్థలు చిప్స్ను బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తున్నది.