హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భునవగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్స్టేషన్లో మరియమ్మ మృతిఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తెలిపారు. పోలీసులు కొట్టడం వల్ల మరియమ్మ మరణించలేదని, గుండెపోటే ఆమె మృతికి కారణమని హైకోర్టుకు వివరించారు. ఆమెకు ఇతర అనారోగ్య సమస్యలూ ఉన్నాయని చెప్పారు.
మరియమ్మ మృతిపై న్యాయ విచారణకు ఆదేశించి ఆమె మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, మరియమ్మ కుటుంబసభ్యులకు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు సీజే జస్టిస్ సతీశ్చంద్రశర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్రెడ్డితో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఆమె మృతికి కారకులైన ఎస్సై, కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించడంతోపాటు ఆమె కుటుంబానికి 15 లక్షల పరిహారాన్ని, కొడుక్కు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇచ్చిందని ఏజీ చెప్పారు.
మరియమ్మ మృతదేహానికి రెండోసారి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికను ఆలేరు మేజిస్ట్రేట్ సీల్డ్కవర్లో హైకోర్టుకు అందజేశారు. మరియమ్మ మృతదేహంపై గాయాలున్నట్టు ఆ నివేదికలో పేర్కొనడంతో సీబీఐని, కేంద్రాన్ని ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు పిటిషనర్కు సూచించింది. 22న తదుపరి విచారణకు సీబీఐ ఎస్పీ హాజరుకావాలని ఉత్తర్వు లిచ్చింది. ఈ కేసు రికార్డులను అదనపు సొలిసిటర్ జనరల్కు అందజేయాలని ఏజీని ఆదేశించింది.