హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో సామాన్య ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదని ఐసీఎంబీ స్కూల్ ఆఫ్ బిజినెన్ ఎక్స్లెన్స్ ఆర్థికశాఖ విభాగం హెడ్ ప్రొఫెసర్ పీ సాయిరాణి, ప్రొఫెసర్ సయ్యద్ అజహర్ అభిప్రాయపడ్డారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటికీ కార్పొరేట్ల పక్షమేనన్న విషయం ఈ బడ్జెట్తో తేటతెల్లమైందని పేర్కొన్నారు. ‘ఇన్సైట్స్ ఆన్ బడ్జెట్-2022’ అనే అంశంపై మంగళవారం లక్డీకాపూల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ (ఐఐఎంసీ)లో సదస్సు జరిగింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు సంయుక్తంగా నిర్వహించిన ఈ సదస్సులో సాయిరాణి మాట్లాడుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళ అయినప్పటికీ బడ్జెట్లో మహిళా సాధికారతకు మొండిచేయి చూపారని విమర్శించారు. ఈసారి బడ్జెట్లో కేటాయింపులు భారీగా తగ్గడంపై మహిళలు సహా అన్ని వర్గాల నుంచి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతున్నదని పేర్కొన్నారు.
ఉపాధి హామీ నిధుల్లో కోత
ఉపాధి హామీ పథకానికి గతంలో కంటే ఈసారి బడ్జెట్లో నిధులను భారీగా తగ్గించారని ప్రొఫెసర్ సయ్యద్ అజహర్ విమర్శించారు. కరోనా విజృంభణ అనంతరం పట్ణణాల నుంచి గ్రామాలకు వలసలు పెరి గాయని, వీటిని నివారించేలా బడ్జెట్ రూపకల్పన జరగలేదని పేర్కొన్నారు. దీంతో గ్రామాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగం పెచ్చరిల్లే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. ఐఐఎంసీ ప్రిన్సిపాల్ రఘువీర్ మాట్లాడుతూ.. బడ్జెట్ కేటాయింపులు, రాబడి, వ్యయం తదితర అంశాల గురించి తమ విద్యార్థులు తెలుసుకునేందుకు ఈ సదస్సు ఎంతో ఉపయోగపడిందని చెప్పారు. కార్యక్రమంలో ఐఐఎంసీ వైస్ ప్రిన్సిపాల్, నమస్తే తెలంగాణ సర్క్యులేషన్ మేనేజర్ టీ గణేశ్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.