(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): అదానీ గ్రూప్పై ‘హిండెన్బర్గ్’ ఆరోపణలు స్టాక్ మార్కెట్లతోపాటు రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2014లో రూ.17,000 కోట్ల సంపద కలిగిన అదానీ.. 2023లో రూ. 11.3 లక్షల కోట్లకు అధిపతి కావడంపై ఇప్పటికే పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ విస్తరణ, లావాదేవీలపై గతంలో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ప్రముఖ జర్నలిస్టులు, మేధో సంస్థలు జారీ చేసిన హెచ్చరికలు ఇప్పుడు వైరల్గా మారాయి.
అప్పులే 2.31 లక్షల కోట్ల్లు
అదానీ గ్రూప్ విపరీతంగా అప్పులు చేసిందని, దీంతో ఇది రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ గ్రూప్ యూనిట్ క్రెడిట్సైట్స్ గత ఆగస్టులో హెచ్చరించింది. ఎడాపెడా తీసుకున్న రుణాల్నే ప్రస్తుత, కొత్త వ్యాపారాల్లో అదానీ గ్రూప్ పెట్టుబడి చేస్తున్నదంటూ పేర్కొంది. అదానీ గ్రూప్నకు చెందిన ఆరు లిస్టెడ్ కంపెనీల స్థూల రుణం 2022 మార్చినాటికి రూ. 2.31 లక్షల కోట్ల మేర ఉన్నదని ఫిచ్ వెల్లడించింది.
– ఫిచ్, (ఆగస్టు, 2022)
20 ఏండ్లుగా భారీగా అక్రమ లావాదేవీలు: ఫిన్సెస్ (సెప్టెంబర్, 2020)
హెచ్ఎస్బీసీ, స్టాండర్డ్ చార్టర్డ్, బార్క్లేస్, డాయిష్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెల్లాన్ లాంటి ప్రపంచంలోని దిగ్గజ బ్యాంకుల ద్వారా అదానీ కంపెనీల్లో గత 20 ఏండ్లలో భారీగా అక్రమ లావాదేవీలు జరిగాయని అమెరికా ఆర్థిక శాఖలోని ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ (ఫిన్సెస్) ఆరోపించింది. ట్యాక్స్ హెవెన్ దేశం సీషెల్స్ నుంచి సింగపూర్లోని ‘అదానీ గ్లోబల్ పీటీఈ’కి మనీల్యాండరింగ్ ద్వారా బిలియన్ డాలర్లు వచ్చాయన్నది.
50 ఏండ్లపాటు లీజు ఇవ్వడమా? వద్దే.. వద్దు: నీతి ఆయోగ్ (ఫిబ్రవరి, 2019)
దేశంలోని ఆరు ప్రధాన విమానాశ్రయాలను అదానీ ఎంటర్ప్రైజెస్కు లీజుకు ఇవ్వడంపై నీతి ఆయోగ్తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా అభ్యంతరం తెలిపింది. ఇది ఫైనాన్షియల్ రిస్క్తో కూడుకోవడంతో పాటు, కంపెనీ నిర్వహణ సామర్థ్యానికి పరీక్షగా వెల్లడించింది. రెండు కంటే ఎక్కువ ఎయిర్పోర్టులను లీజుకు ఇవ్వొద్దని సూచించింది.
అవకతవకలు జరిగాయ్?:
గడిచిన 8 ఏండ్లలో ఎన్నడూ చూడనంత వృద్ధి రేటును ఓ గ్రూప్ నమోదుచేస్తున్నదని అదానీ గ్రూప్ను పరోక్షంగా ఉదహరిస్తున్న ప్రముఖ జర్నలిస్ట్ సుచేతా దలాల్ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి సన్నిహితుడిగా పిలిచే ఆ వ్యక్తి గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరుగుతున్నట్టు అనిపిస్తున్నదంటూ ఆమె పేర్కొన్నారు.
– జర్నలిస్ట్ సుచేతా (ఫిబ్రవరి, 2022)
సెజ్ రూల్సూ మారాయ్
అదానీ గ్రూప్కు లబ్ధి చేకూర్చేందుకు స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) నిబంధనలనే మోదీ సర్కారు మార్చేసిందని ప్రముఖ జర్నలిస్ట్ పరాంజయ్ గుహా తెలిపారు. తద్వారా అదానీకి రూ. 500 కోట్లు ప్రయోజనం లభించినట్టు వెల్లడించారు. దీంతో పరాంజయ్పై అదానీ గ్రూప్ పరువు నష్టందావా వేసి ఇబ్బందులకు గురిచేసింది.
-జర్నలిస్ట్ పరాంజయ్ (జూన్, 2017)