Manu | యూనివర్సిటీ భూములను కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోందని మనూ విద్యార్థులు ఆరోపించారు. భూముల అమ్మకాలపై పోరాటం చేస్తుంటే వేధిస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యూనివర్సిటీల్లో రియల్ ఎస్టేట్ దందా చేస్తే సహించమని వార్నింగ్ ఇచ్చారు. రాజ్యాంగం పట్టుకుని తిరిగేవాళ్లు విద్యార్థులకు అన్యాయంపై స్పందించరా అని ప్రశ్నించారు.
హైదరాబాద్ నందినగర్లోని నివాసంలో కేటీఆర్తో సమావేశం అనంతరం మనూ విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. రేవంత్ సర్కార్ కుట్రలపై ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఎంపీలందరూ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. మనూ భూములపై అధికారులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలన్నారు. లేదంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్ని యూనివర్సిటీల విద్యార్థులతో కలిసి పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. మనూ వర్సిటీలో జరుగుతున్న కుట్రలపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు.
రేవంత్ కుట్రలతో విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని మనూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించకుండా భూములు అమ్ముతామంటే ఎలా అని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని మనూ విద్యార్థులు విమర్శించారు. భవిష్యత్ తరాలకు విద్య లేకుండా చేసేందుకు రేవంత్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ సర్కార్ దురుద్దేశ్యంతో విద్యార్థులకు మోసం చేస్తుందని అన్నారు. మనూలో మౌలిక వసతులను మరింత మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.