వానకాలం వడ్ల సేకరణకు యంత్రాంగం సన్నద్ధమైంది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 64,749 హెక్టార్లలో వరి సాగు చేయగా, ఇంటి అవసరాలు, మిల్లర్లకు అమ్ముకోవడంలాంటివి మినహాయిస్తే లక్షా 76 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశమున్నది. మొత్తం 250 కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేపట్టనుండగా, ఇప్పటికే 26 కేంద్రాలు ప్రారంభించింది. నేటి నుంచి తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించనుండగా, మిల్ ట్యాగింగ్ కూడా పూర్తి చేసింది..
మంచిర్యాల అర్బన్, నవంబర్ 18 : జిల్లావ్యాప్తంగా 64,749 హెక్టార్ల (లక్షా 61 వేల 872 ఎకరాల)లో రైతులు వరి పం టను సాగు చేశారు. హెక్టారుకు 5.44 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అధికారులు అంచనా వేశారు. కాగా ఇందులో కొంతమంది ఇంటి అవసరాలకు సన్నరకాలు సాగు చేయడం, అందులో వెరైటీ (హైబ్రీడ్) పంటలను నేరుగా మిల్లర్లకు అమ్ముకోవడం లాంటివి మినహాయిస్తే కొనుగోలు కేంద్రాలకు లక్షా 76 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ఇప్పటివరకు జిల్లాలో 26 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా, మిగితావి కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతు సాగు చేసిన లెక్కన నవంబర్లో 44 వేల మెట్రిక్ టన్నులు, డిసెంబర్లో 88 వేల మెట్రిక్ టన్నులు, 2022 జనవరిలో 44 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈమేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.
కొనుగోలు కేంద్రాలకు పూర్తయిన మిల్ ట్యాగింగ్
జిల్లాలో 250 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించనున్నారు. ఇందులో 77 డీఆర్డీఏ ఐకేపీ, 121 పీఏసీఎస్, 52 డీసీఎంఎస్ ఏజెన్సీల ద్వారా ప్రక్రియ సాగనున్నది. ప్రాథమికంగా 241 కేంద్రాలకు జిల్లాలోని 32 రా రైస్ మిల్లులకు, 15 బాయిల్డ్ రైస్ మిల్లులకు ధాన్యం తరలించేందుకు ట్యాగింగ్ చేసి ఆయా కేంద్రాలను సిద్ధం చేసి ఉంచారు. ధాన్యం టార్గెట్ పూర్తవగానే ట్యాగింగ్ మార్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
11 లక్షల గన్నీ సంచులు అందుబాటులో…
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైస్మిల్లులకు తరలించేందుకు 44 లక్షల గన్నీ(గోనె) సంచులు అవసరం కాగా, ప్రస్తుతం 11 లక్షల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. సివిల్ సప్లయ్ గోదాముల్లో 8,71,427 అందుబాటులో ఉండగా, రైస్ మిల్లర్స్ వద్ద రెండు లక్షలు, రేషన్ దుకాణాల వద్ద లక్షా 50 వేల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయి. మిగితా 31,68,573 బ్యాగులను ఇతర రాష్ట్రాల నుంచి వారం రోజుల్లో జిల్లాకు రానున్నాయని సివిల్ సప్లయ్ అధికారులు చెబుతున్నారు.
నేటి నుంచి ఆరిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తాం..
కలెక్టర్ భారతీ హోళికేరి, అదనపు కలెక్టర్ మధుసూదన్ నా యక్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ప్రారంభిస్తున్నాం. అంతే గాకుండా తూకం వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వీలుగా మిల్ ట్యా గింగ్ కూడా పూర్తి చేశాం. లారీలను సైతం కేంద్రం వారీగా అటాచ్ చేసి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రణాళికలు తయారు చేశాం. మిల్లుల్లో అన్లోడింగ్ వేగవంతం చేసేందుకు హమాలీల సంఖ్యను పెంచుకోవాలని ముందుగానే మిల్లర్లకు సూచించాం. రైతులు 17 శాతం లోపు తేమ ఉండి, తాలు, తప్ప లేని నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలి.