రెక్కాడితేగానీ డొక్కాడని చిరువ్యాపారుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా ఉంది. చుక్కలనంటుతున్న గ్యాస్ ధరలతో వారి భవితవ్యం అగమ్యగోచరంగా మారింది. రెండేళ్లుగా కొవిడ్తో కుదేలై ఇప్పుడిప్పుడే కోలుకుం టుండగా, మరోసారి పెంచిన సిలిండర్ ధర భయపెడుతు న్నది. సోమవారం ఏకంగా రూ.266 వడ్డించగా, 19 కేజీల కమర్షియల్ గ్యాస్ రేటు రూ. 2210కి చేరింది. కాగా ధరల భారం మోపుతున్న కేంద్రం వైఖరిపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
గిట్లయితే ఎట్ల బతుకుడు..
మంచిర్యాలలో హోటల్ నడిపిస్తున్న. బజ్జీలు, పకోడి, పూరీలు, టిఫిన్లు చేసి అమ్ముతుంట. కరోనాతో మొన్నటి దాకా సక్కగా వ్యాపారం నడువలే. గిప్పుడి ప్పుడే గిరాకీ అయితంది. కేంద్ర సర్కారోళ్లు గిట్లా తేపతేపకూ గ్యాస్ ధరలు పెంచు తున్రు. ఒక్కసారే రూ. 270 పెంచితే మా అసొంటి చిన్న వ్యాపా రులు ఎట్లా బతుకుడో అర్థమయితలేదు. ఇప్పటికైనా మాలాంటోళ్ల పరిస్థితి చూసి సిలిండర్ ధర తగ్గించాలె.
మంచిర్యాల/ఎదులాపురం, నవంబర్ 2, నమస్తే తెలంగాణ : నెలనెలా పెరుగుతున్న వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు చిరువ్యాపారుల నడ్డి విరుస్తున్నాయి. కొంతకాలంగా కొవిడ్తో బిజినెస్ నడువక ఇబ్బందులు పడ్డవారంతా ఇప్పడిప్పుడే తేరుకుంటున్నారు. ఈ తరుణంలో వాణిజ్య సిలిండర్ ధర పెంపు కలవరపాటుకు గురిచేస్తున్నది. మనదేశానికి చెందిన ఆయిల్ కంపెనీలు అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ గ్యాస్ ధరను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతున్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తుం టాయి. ప్రభుత్వం విధించే పన్నులు కూడా ధరల పెరుగుదలపై ప్రభావాన్ని చూపుతాయి. అయితే గృహావ సరాలకు వినియోగించే సిలిండర్ల ధరలను యథాత థంగా ఉంచడం కొంత ఊరటనిస్తున్నది. తాజాగా చమురు సంస్థలు 19 కిలోల వాణిజ్య వంటగ్యాస్ ధరను భారీగా పెంచాయి. ఒకేసారి ఏకంగా రూ.270 పెంచుతున్నట్లు ప్రకటించాయి. సవరించిన ధరలు సోమవారం నుంచే అమల్లోకి వస్తాయని తెలిపాయి. మంచిర్యాల పట్టణంలో ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర రూ.1,940 ఉండగా, పెరిగిన ధర రూ.270తో రూ.2,210కు చేరింది. ఎల్పీజీ ధర పెంపుతో పాటు కేంద్రం గతేడాది నుంచి రాయితీని కూడా తొలగించింది. సాధార ణంగా ఓ టీ స్టాల్లో నెలకు సగటున నాలుగు వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తుం టారు. ఈ లెక్కన ప్రస్తుతం పెరిగిన ధర ప్రకారం నెలకు రూ.1,080 వరకు అదనపు భారాన్ని మోయాల్సి వస్తుంది. దీంతో చిరువ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అరకొర ఆదాయంతో ఉసూరు మంటున్న తమను పెరిగిన బండ ధర మరింత కుంగదీసే పరిస్థితి నెలకొందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాపారమెట్ల చేసుడు
లక్షెట్టిపేట రూరల్, నవంబర్ 2 : లక్షెట్టిపేటలో నాకు సిరివిని టీ స్టాల్ ఉంది. ఇన్ని రోజుల సంది గిరాకీ లేదు. కరోనా తర్వాత వ్యాపారం అంతంత మాత్రంగానే ఉంది. సరుకుల ధరలు పెరగడంతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నం. మళ్లీ ఇప్పుడు గ్యాస్ బండ పెరిగితే వ్యాపారం ఎలా చేయాల్నో అర్థమయితలేదు. ఇప్పటి నుంచి ప్రతి నెలా వెయ్యికి పైగా వచ్చే అదనపు ఖర్చుతో మస్తు తిప్పలయితది. ఇలా అయితే కుటుంబాన్ని ఎట్లా పోషించుడు.
బతుకడం కష్టం
గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచడం అన్యాయం. పొద్దంతా కష్టపడితే కడుపునిండా తినలేని పరిస్థితి ఉంది. మోడీ ప్రభుత్వం సామాన్యుల గురించి ఆలోచించడం లేదు. టీ పాయింట్ నడుపాలంటే మస్తు కష్టంగా ఉంది. మళ్లీ బొగ్గుల మీద చాయ్ కాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా అయితే బతుకడం కష్టం. ఇకనైనా ధరలు తగ్గిస్తే మంచిగుంటది.