వనపర్తి : జిల్లా కేంద్రంలోని దామోదర్ తోటలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకున్నది. మెడకు సీసా గుచ్చుకొని ఉండగా.. తీవ్ర రక్తస్రావమై సదరు వ్యక్తి మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, ఎస్ఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకోటకు చెందిన రమేశ్ సాగర్ (40) భార్య రమ మధ్య తరుచు మనస్పర్థలు రావడంతో గత 20 ఏండ్ల కింద విడిచిపెట్టి వెళ్లి పోయింది. దీంతో తల్లి మణెమ్మతో కలిసి ఉంటూ కూలి పని కోసం వనపర్తికి వస్తూ పోతూ ఉండేవాడు.
సోమవారం వనపర్తికి వచ్చిన అతను మధ్యాహ్నం దామోదర్ తోట వద్ద ఇండ్ల పక్కల ఉన్న ఖాళీ స్థలంలో మృతుడు రమేశ్ గొంతుకు సీసాతో పొడుచుకుని రక్తపు మడుగులో మృతదేహం పడి ఉంది. అటుగా వెళ్లిన మున్సిపల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. అయితే, స్థానికులను విచారించగా.. తాము ఎవరూ చూడలేదని సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ క్లూస్ టీంను రంగంలోకి దింపి.. వివరాలు సేకరించారు. అయితే, మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేసి ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.