కోల్కతా, మార్చి 13: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) డిపాజిట్ల వడ్డీ రేటుపై కోత విధించడాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఉత్తరప్రదేశ్లో గెలిచిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వేతన జీవులకు ఇచ్చిన ‘గిఫ్ట్కార్డు’ ఇది అని ఆదివారం ట్విట్టర్లో వ్యంగ్యంగా విమర్శించారు. ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని ఐక్య పోరాటాల ద్వారా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా సంక్షోభంతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మధ్య, దిగువ తరగతి ఉద్యోగులకు కేంద్రం నిర్ణయం శరాఘాతం వంటిదని ఆందోళన వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలను విస్మరిస్తూ.. కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తూ వారిని నెత్తిన పెట్టుకుంటున్నదని విమర్శించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీరేటును 4 దశాబ్దాల కనిష్టస్థాయి 8.1 శాతానికి తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.