న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా మల్లిఖార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ఇవాళ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించారు. సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖర్గేకు ఈ సందర్భంగా రాహుల్ పుష్పగుచ్ఛం అందించారు. 24 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీలో గాంధీయేతర వ్యక్తి ఆ పార్టీ పగ్గాలను చేపట్టారు.
ఖర్గే వయసు 80 ఏళ్లు. ఇవాళ ఉదయం సోనియా గాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఖర్గేకు ఎన్నికల్లో గెలిచిన సర్టిఫికేట్ను అందజేశారు. తనకు మద్దతుగా ఓటు వేసిన ప్రతి ఒక ప్రతినిధికి ఖర్గే ధన్యవాదాలు తెలిపారు. ఓ కార్మికుడికి కుమారుడు, ఓ కాంగ్రెస్ వర్కర్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారని, తనకు ఉన్న పనితనం, అనుభవంతో ఈ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
బాధ్యతలు స్వీకరించడానికి ముందు ఖర్గే ఇవాళ ఉదయం రాజ్ఘాట్ వెళ్లి అక్కడ నివాళి అర్పించారు. కష్టకాలంలో పార్టీని ముందు ఉండి నడిపిన సోనియాకు ఖర్గే థ్యాంక్స్ తెలిపారు. ఆమె నేతృత్వంలోని రెండుసార్లు యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే.