శ్రీశైలం : కార్తీకమాసం సందర్భంగా నిలిపివేసిన శ్రీశైల మల్లన్న గర్భాలయ స్పర్శ దర్శనాలను పునః ప్రారంభించినట్లు దేవస్థానం ఈవో లవన్న తెలిపారు. గురువారం సాయంత్రం పరిపాలనా భవనంలో ఆలయ ప్రధాన విభాగాధిపతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో జ్యోతిర్లింగ క్షేత్ర దర్శనమే కాకుండా దక్షిణ భారత దేశంలో మూలవిరాట్టుకు స్వయంగా తల తాకించి చేసుకునే స్పర్శదర్శనం అనాదిగా వస్తున్న సాంప్రదాయమని తెలిపారు.
అయితే, కొవిడ్ నిబంధనల అమలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అందరికీ అలంకార దర్శనాలు మాత్రమే కల్పించాలన్న ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తీసుకున్న నిర్ణయాలను.. భక్తుల అభీష్టంతో పాటు పలు హిందూ ధార్మిక సంఘాలు, ఆగమశాస్త్ర పండితుల సూచనల మేరకు దర్శన విధానాల్లో మార్పులు చేశామన్నారు. సామూహిక అభిషేక సేవాకర్తలకు, గర్భాలయ అభిషేక సేవాకర్తలకు, వీఐపీ బ్రేక్ టిక్కెట్లను తీసుకున్న వారికి స్పర్శదర్శనాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆది, సోమవారాలు, పౌర్ణమి ఏకాదశి రోజుల్లో గర్భాలయ ప్రవేశం పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ప్రధానంగా రద్దీ రోజుల్లొ వీఐపీ దర్శనాలను సాధ్యమైనంత వరకు అదుపుచేసి సామాన్య భక్తులకు సంపూర్ణ అలంకార దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి శని ఆది సోమ వారాల్లో సగటున రొజకు 30వేలకుపైగా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుంటున్నట్లు ఈవో తెలిపారు. అదే విధంగా పరిమిత సంఖ్యలో ఉండే ఆర్జితసేవా టిక్కెట్లను కేవలం దేవస్థానం కౌంటర్లలో మాత్రమే రుసుము చెల్లించి తీసుకొవాలని, దళారులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకోవద్దని భక్తులకు సూచించారు.