యాచారం, డిసెంబర్ 5 : మండలంలోని మాల్ గ్రామపంచాయతీ వాణిజ్యరంగంలో దూసుకుపోతుంది. ఒకప్పుడు ఒక బావి, రెండు ఇండ్లు ఉన్న మాల్ నేడు సాగర్ రహదారికిరువైపులా కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది. ఇలా వాణిజ్యంతో పాటు రియల్ఎస్టేట్ పుంజుకోవటంతో ఈ పంచాయతీ మండలంలోని ఇతర గ్రామపంచాయతీలకంటే అభివృద్ధిలో అగ్రస్థానంలో కొనసాగుతూ ఆదర్శంగా నిలుస్తున్నది. ఇక్కడ ప్రతి మంగళవారం జరిగే సంత చుట్టు పక్కల ప్రాంతాల్లోనే ఎంతో ప్రఖ్యాతి పొందింది. ఈ సంతలో దొరకని వస్తువంటూ ఉండదు మరీ…
మాల్గా అవతరించిన పెర్కోనిబావి
రంగారెడ్డి-నల్గొండ-మహబూబ్నగర్ జిల్లాల సరిహద్దు ప్రాంతమైన మాల్ ఒకప్పుడు ఒక బావితో పాటు రెండిండ్లు సాగర్ రహదారిపై ఉండేవి. అది పెరుక వర్గం వారికి చెందిన బావి కావటంతో ఈ ప్రాంతాన్ని పెర్కోనిబాయి అని పిలిచేవారు. క్రమంగా అది దినదినాభివృద్ధి చెందుతుంటే దానిని ‘మహేల్’ అని పిలిచేవారు. క్రమంగా మహేల్ పోయి మాల్గా పిలుస్తున్నారు. ప్రస్తుతం రంగారెడ్డి-నల్లగొండ జిల్లాల సరిహద్దులో మాల్ వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుతున్నది.
మాల్ చరిత్ర
మాల్ గ్రామం 1954నుంచి 1982వరకు పక్కనే ఉన్న నల్లవెల్లి గ్రామానికి అనుబంధంగా ఉండేది. మాల్ విస్తరించి జనాభా పెరగటంతో 1982లో నూతనంగా పంచాయతీ మాల్ గ్రామాన్ని ఏర్పాటు చేశారు. 2011జనాభా లెక్కల ప్రకారం గ్రామంలో 8,228మంది జనాభా ఉండగా, 2,529 మంది ఓటర్లున్నారు. గ్రామంలో ఆంధ్రాబ్యాంకు, స్టేట్బ్యాంకు, రెండు పెట్రోల్ బంక్లు, జడ్పీహెచ్ఎస్, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, పీఎంఆర్ పీజీ కళాశాల, బీఎస్ఎన్ఎల్ టెలీఫోన్ కేంద్రం, అంగన్వాడీ, డ్వాక్రా భవనాలున్నాయి. మల్టీ స్పెషాలిటీ దవాఖానలు, వాహనాల షోరూమ్లు, అదే విధంగా మదర్డెయిరీ తదితర వ్యాపార సంస్థలు ఉన్నాయి. చుట్టు పక్కల గ్రామాల్లోని అనేక మందికి ఉపాధి దొరుకుతున్నది. అదే విధంగా పాడి రైతులకు ఎంతగానో లాభదాయకంగా నిలుస్తున్నదీ మాల్. మార్కెట్లో సాగర్రోడ్డుకిరువైపులా వాణిజ్య సంస్థలు, వ్యాపార కేంద్రాలున్నాయి. ఇవి మూడు జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండి, అన్ని రకాల సరుకులను అందుబాటులో ఉంటున్నాయి.
మార్కెట్లో ఊపందుకున్న వ్యాపారం
మార్కెట్ సాగర్ రహదారిపై ఉండటంతో నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా కనిపిస్తున్నది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, రైతులు ఇక్కడ వ్యాపారాలు నిర్వహించి, ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. దీంతో మాల్గడ్డ నిరుపేదలకు అడ్డాగా మారి, వారిని ఆర్థికంగా ఆదుకుంటుంది. ముఖ్యంగా పశువుల సంతకు మాల్ పెట్టింది పేరు. ప్రతి మంగళవారం పశువుల క్రయవిక్రయాలతో మాల్ సంత కిటకిటలాడుతున్నది. సంతతో లక్షలాది రూపాయల ఆదాయం పంచాయతీకి సమకూరుతున్నది. సంతరోజు మూడు నుంచి ఐదుకోట్ల వరకు వ్యాపారం నడవగా రోజు సుమారు కోటి రూపాయల వరకు వ్యాపారం జరుగడం విశేషం. పైగా, మాల్ చుట్టూ వెంచర్లు వెలిసి రియల్ వ్యాపారంలో తనకంటూ స్థానాన్ని నిలుపుకుంటున్నది.
మంగళవారం సంత..
మండలంలోని మాల్లో ప్రతి మంగళవారం సంత నిర్వహిస్తారు. పశువులు క్రయవిక్రయాలతో పాటు చౌకధరలకే అన్ని రకాల వస్తువులు లభిస్తుండడంతో వందల మంది సంత రోజు మాల్కు రాక మానరు. మండల ప్రజలే కాదు, మర్రిగూడ, దేవరకొండ, చింతపల్లి, మల్లెపల్లి, మాడ్గుల, కందుకూరు, మహేశ్వరం, ఆమన్గల్, మంచాల, కడ్తాల ప్రాంతాల నుంచి మాల్ సంతకు వచ్చి క్రయవిక్రయాలు కొనసాగిస్తారు.
జోరుగా పశుక్రయవిక్రయాలు
మాల్ సంతలో రైతులు అమ్మటానికి తెచ్చిన ఆవులు, ఎద్దులు, బర్రెలు, మేకలు, గొర్రెలు పెద్ద సంఖ్యలో దర్శనమిస్తాయి. వివాహాది శుభకార్యాలు, ఇతర ఫంక్షన్లకు మేకలు, గొర్రెలను సంతలో చౌకధరలకు కొనుగోలు చేస్తుంటారు. ఇబ్రహీంపట్నం, చింతపల్లి, మల్లెపల్లిలో జరిగే సంతలకంటే కూడా మాల్ సంతకు మంచి ప్రాముఖ్యత సంతరించుకున్నది.
సంతలో లభించేవి..
ప్రతి అంగడి రోజు నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంట సామగ్రి, బియ్యం, మంచినూనె, కందిపప్పు, చింతపండు, ఉల్లిగడ్డ, కొత్తబట్టలు, పాతబట్టలు, వట్టిమిర్చి, పచ్చిమిర్చి, నిమ్మకాయలు, సబ్బులు, అల్లంవెల్లుల్లి, చికెన్, మటన్, వంటపాత్రలు, పూజసామగ్రి, చెప్పులు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా అన్ని వస్తువులు ఇక్కడే లభిస్తున్నాయి. ధనిక వర్గాల నుంచి నిరుపేదల వరకు ఈ అంగట్లోనే అన్ని వస్తువులను కొనేందుకు ఇష్టపడుతున్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు అంగడిరోజు ఇక్కడికి వస్తుంటారు. అలాగే రైతులకు కావల్సిన నాగళ్లు, కొడవళ్లు, గొడ్డళ్లు, పగ్గాలు, గడ్డపారలు, పారలు తదితర వ్యవసాయ పనిముట్లు కూడా కొనుగోలు చేస్తారు. అన్ని వస్తువులను వ్యాపారులు అందుబాటులో ఉంచుతున్నారు.
వ్యవసాయ సామగ్రి..
పశువుల సంత వద్ద వ్యవసాయానికి సంబంధించిన వస్తువులను అమ్ముకుని నిరుపేదలు జీవనోపాది పొందుతున్నారు. పశువులకు దిష్టి తగులకుండా ఉండేందుకు వాటి మెడలో వేసే దిష్టిపూసలు, గవ్వలను ఇక్కడ అమ్ముతారు. ముఖ్యంగా పశువులను కట్టివేసేందుకు వాడే తాళ్లు, పశువులు పంటలను మేయకుండా వాటి మూతులకు ఉపయోగించే బుట్లు, మూకుతాళ్లు, ముళ్లు కర్రలు, పశువులు రాళ్లు రప్పల్లో నడిచే విధంగా ఇనుప రక్షణ కవచాలు, గజ్జెలు విక్రయిస్తారు. గృహోపకరణాలు ఇక్కడ లభిస్తాయి.
ఎంతో మందికి ఉపాధి
మాల్ అంగడితో ఎంతో మందికి ఉపాధి దొరుకుతున్నది. అన్ని వర్గాల ప్రజలకు అంగడి అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. అన్ని రకాల వస్తువులు అంగడిలో ఒకే చోట చౌక ధరలకు లభించడంతో మాల్ అంగడికి ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. నిత్యావసర వస్తువులు, చేపలు, వ్యవసాయ పనిముట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, పశువులు, మేకలు, దుస్తులు దొరుకుతాయి. నిరుపేద, మధ్య తరగతి ప్రజలకు, వలస కార్మికులకు ఇది ఎంతో ఉపయోగ పడుతున్నది.