మహబూబ్నగర్, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చెంతనే కృష్ణమ్మ ఉన్నా.. చుక్క నీరు రాక ఆ నియోజకవర్గంలో భూములు బీళ్లుగా మారాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. తాగు, సాగునీటికి గోసపడ్డ చోట ప్రస్తుతం పచ్చదనం పరిఢవిల్లుతున్నది. తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న మక్తల్ నియోజకవర్గం 2016 నుంచి అభివృద్ధిలో దూసుకుపోతున్నది. భీమా ప్రాజెక్టును పూర్తిచేయడంతో సాగు జోరందుకున్నది. దీంతో ఈ ఏడాది గరిష్ఠంగా రెండు లక్షలకుపైగా సాగు విస్తీర్ణం పెరిగింది. మక్తల్ పట్టణంలో 150 పడకల దవాఖాన పనులు జరుగుతున్నాయి. డిగ్రీ కళాశాల మంజూరైంది. కోర్టు భవనానికి స్థలాన్ని ప్రతిపాదించారు. దేవరకద్ర-మునీరాబాద్ రైల్వేలైన్కు అడ్డంకులు తొలగడంతో రైళ్ల రాకపోకలకు గ్రీన్సిగ్నల్ లభించింది. సీఎం కేసీఆర్ పథకాలు, సంక్షేమానికి ఆకర్షితులై గులాబీ జెండా పట్టుకున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
తెలంగాణ ఏర్పడ్డాక ఉమ్మడి జిల్లాలో పెండింగ్లో ఉన్న భీమా ప్రాజెక్టును పూర్తిచేయడంతో మక్తల్ నియోజకవర్గంలో సాగు జోరందుకున్నది. ఈ ఏడాది గరిష్ఠంగా రెండు లక్షలకుపైగా సాగువిస్తీర్ణం పెరిగింది. ఎగువన వర్షాలు పడి కృష్ణమ్మకు వరద రాగానే భీమా ప్రాజెక్టు కాల్వల్లో వరదనీరు పరుగులు పెడుతున్నది. సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లు నింపే వరకు మోటర్లు ఆన్లోనే ఉంటాయి. కాల్వలకు నీళ్లు వెళ్తుండగానే డిస్ట్ట్రిబ్యూటర్ల ద్వారా గ్రామాల్లోని చెరువులు నింపుతున్నారు. కాల్వల్లో కంపచెట్లు మొలిచి చివరి ఆయకట్టుకు నీళ్లు వెళ్లలేని పరిస్థితి. గమనించిన ఎమ్మెల్యే చిట్టెం కాల్వల ఆధునీకరణ, మోటర్ల మరమ్మతుకు సీఎం కేసీఆర్తో మాట్లాడి రూ.30కోట్ల నిధులు మంజూరు చేయించారు. దీంతో మక్తల్, మాగనూరు, కృష్ణా, నర్వ మండలాల్లో బీడుభూములు సాగులోకి వచ్చాయి. జూరాల ఎడమ కాల్వ, కోయిల్సాగర్ లిఫ్ట్ల ద్వారా ఆత్మకూర్, అమరచింత మండలాల్లో కూడా పుష్కలంగా సాగునీరు అందుతున్నది. పెద్దవాగులపై ఆత్మకూర్ మండలం కొత్తపల్లి, మాగనూరు మండలం మందిపల్లి వద్ద చెక్డ్యాంల నిర్మాణానికి రూ.11కోట్లు మంజూరు చేశారు.ఇవి పూర్తయితే వాగు పరీవాహక ప్రాంతాల్లోని పొలాలకు సాగునీరు అందుతుంది.
మారిన మక్తల్ రూపురేఖలు
మక్తల్ పట్టణంలోని సర్కారు దవాఖానకు రూ.44 కోట్లు మంజూరు చేయడంతో 150పడకల భవనం నిర్మిస్తున్నారు. గతంలో విద్యార్థులు ఇంటర్ పూర్తయితే ఉన్నత చదువులకు నారాయణపేట, మహబూబ్నగర్కు వెళ్లే పరిస్థితి. విద్యార్థుల ఇక్కట్లను గుర్తించి స్థానికంగానే డిగ్రీ కళాశాల మంజూరు చేశారు. అలాగే ఫైర్స్టేషన్ మంజూరు చేయించి స్థలాన్ని కూడా కేటాయించారు. రహదారుల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపడంతో ఆర్అండ్బీశాఖ రూ.24కోట్లు, పంచాయతీరాజ్ నుంచి మరో రూ.32 కోట్లు మంజూరయ్యాయి. కోర్టు భవనానికి కూడా స్థలాన్ని ప్రతిపాదించారు. మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేయగా మక్తల్, అమరచింత, ఆత్మకూర్ మున్సిపాలిటీకి రూ.5కోట్లు మంజూరయ్యాయి. అదనంగా మక్తల్కు రూ.15కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపించారు. సీఎం ప్రత్యేక నిధుల కింద ప్రతి పంచాయతీకి రూ.20లక్షలు, మున్సిపాలిటీకి రూ.50లక్షల నిధులు వచ్చాయి. నియోజకవర్గంలో ఆరు గురుకుల పాఠశాలలకుగానూ, ఇటీవల ఇంటర్మీడియెట్ కళాశాలగా పాఠశాలను అప్గ్రేడ్ చేశారు. ఇటీవల మహబూబ్నగర్కు వచ్చిన సీఎం సీఎం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధికి మరో రూ.15కోట్లు ఇస్తామని ప్రకటించారని, ఈ నిధులు వస్తే నియోజకవర్గ అభివృద్ధి రూపురేఖలే మారిపోతాయని ఎమ్మెల్యే చిట్టెం తెలిపారు.
అన్ని హంగులతో అంతర్రాష్ట్ర రహదారి
ఏండ్లుగా పెండింగ్లో ఉన్న జాతీయరహదారి పనులను ఎమ్మెల్యే చిట్టెం ముందుండి పూర్తి చేయించారు. దీంతో అంతర్రాష్ట్ర రహదారి అ యిన మక్తల్-హైదరాబాద్-రాయిచూర్ రహదా రి రూపురేఖలే మారిపోయాయి. కర్ణాటక వరకు రహదారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రయాణించవచ్చు. మక్తల్ పట్టణంతో పాటు గ్రామాలకు వెళ్లే రోడ్లు సైతం నాలుగులేన్ల రహదారిగా విస్తరించారు. దేవరకద్ర-మునీరాబాద్ రైల్వేలైన్కు దశాబ్దకాలంగా ఉన్న అడ్డంకులు తొలగించడంతో మ క్తల్ నియోజకవర్గంలో రైళ్ల రాకపోకలకు గ్రీన్సిగ్న ల్ లభించింది. కృష్ణా వరకు రైల్వేలైన్ పనులు పూ ర్తి కానున్నాయి. పట్టణంలో రైల్వేస్టేషన్ వరకు నా లుగులేన్ల రహదారిని విస్తరించేందుకు ప్రతిపాదించారు. అంతేకాకుండా జంక్షన్లను కూడా అందం గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని ప్రతిపాదించారు. మక్తల్ చెరువులో ఏడాది పొడవునా కృష్ణానది నీళ్లు ఉండేలా చూడటంతోపాటు మినీ ట్యాంకుబండ్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. ట్యాంకుబండ్ పక్కన జాతీయరహదారిని ఆనుకొని పార్కును అభివృద్ధి చేస్తున్నారు.
ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలని 2016లో బీఆర్ఎస్ పార్టీలో చేరాను. మా నాన్న దివంగత చిట్టెం నర్సిరెడ్డి కలలుగన్న భీమా ప్రాజెక్టు పూర్తి చేయడంతోపాటు నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నాను. అన్ని పనులు పూర్తిచేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతా.
– చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే, మక్తల్