షిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో కుంభవృష్టి కురిసింది. కులు జిల్లాలోని పర్వతి లోయలో ఉన్న చోజ్ ముల్లా వద్ద అకస్మాత్తుగా క్లౌడ్బస్ట్ అయ్యింది. ఈ ఘటన వల్ల స్థానిక గ్రామాల్లో భారీ నష్టం సంభవించింది. చోజ్ గ్రామంలో క్లౌడ్బస్ట్ కావడం వల్ల నలుగురు గల్లంతు అయినట్లు కులు ఎస్పీ గురుదేవ్ చాంద్ శర్మ తెలిపారు. పార్వతి నదిలో అకస్మాత్తుగా వరద పెరగడంతో సమీపంలో ఉన్న క్యాంపు సైట్లన్నీ ఆ ధాటికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఆ వరద ప్రభావం వల్ల కొందరు టూరిస్టులు కొట్టుకుపోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. చోజ్ గ్రామంతో లింకు ఉన్న బ్రిడ్జ్ ధ్వంసం అయ్యింది. నది సమీపంలో ఉన్న ఆరు కేఫ్లు కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి.
షిమ్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఓ భారీ రాయి వచ్చి కారు మీద పడడంతో.. ఓ మహిళ మృతిచెందింది. ఇద్దరు గాయపడ్డారు. దల్లీ టన్నెల్ వద్ద ఈ ఘటన జరిగింది. మంగళవారం రాత్రి నుంచి షిమ్లాలో ఎడతెరపిలేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఫిరోజ్పూర్-షిప్కీ జాతీయ రహదారిని మూసివేశారు. బ్రోనీ నుల్లాలో నీటి ప్రవాహం పెరగడంతో హైవేను బ్లాక్ చేశారు. కులు జిల్లాలోని మలనా ప్రాజెక్టు వద్ద అకస్మిక వరదలు సంభవించాయి. ఓ బిల్డింగ్లో చిక్కుకున్న 30 మంది ఉద్యోగులను సురక్షితంగా తరలించారు. ఫ్లాష్ ఫ్లడ్స్లో వాహనాలు ధ్వంసం అయ్యాయి.