న్యూఢిల్లీ: భారత్, బంగ్లాదేశ్ల మధ్య నిర్మించిన మైత్రి సేతు బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. భారత్తో ముఖ్యంగా ఈశాన్య భారతాన్ని కలుపుతూ ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి బంగ్లాదేశ్ కట్టుబడి ఉందనేందుకు ఈ బ్రిడ్జి ప్రారంభం విస్పష్ట సంకేతమని బంగ్లా ప్రధాని షేక్ హసీనా అన్నారు. త్రిపురలో భారత సరిహద్దు, బంగ్లాదేశ్ల మధ్య ప్రవహించే ఫెని నదిపై మైత్రి సేతు బ్రిడ్జి నిర్మించారు. 1.9 కిలోమీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి భారత్లోని సబ్రూంను బంగ్లాదేశ్లోని రామ్గఢ్తో కలుపుతుంది.
రూ 133 కోట్లతో ఈ బ్రిడ్జిని నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్మించింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ త్రిపురలో పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్ధాపనలు చేపట్టారు. ఒకప్పుడు విద్యుత్ ఇబ్బందులు ఎదుర్కొన్న త్రిపుర ప్రస్తుతం విద్యుత్లో మిగులు రాష్ట్రంగా అవతరించిందని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడే పెద్ద రాష్ట్రాలు కూడా అభివృద్ధి దిశగా పునరాలోచనలో పడ్డాయని చెప్పారు. కొన్నేండ్లుగా సమ్మెల సంస్కృతితో దెబ్బతిన్న త్రిపుర ఇప్పుడు సులభతర వాణిజ్యం దిశగా కసరత్తు సాగిస్తోందని చెప్పుకొచ్చారు.