కోల్కతా, మార్చి 28: ఫెమా ఉల్లంఘనల కింద నమోదు చేసిన కేసులో ఢిల్లీలో ఈడీ విచారణకు టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. ఈ కేసులో ఈ నెల 28న తమ ముందు హాజరు కావాలంటూ ఆమెకు, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.
తాను పోటీ చేస్తున్న కృష్ణానగర్లో గురువారం ప్రచారం నిర్వహించాల్సి ఉన్నందున గురువారం నాటి ఈడీ విచారణకు హాజరు కావడం లేదని మహువా తెలిపారు. అనంతరం ఆమె ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ సందర్భంగా నదియా కాళీగంజ్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ఈడీ తన పని తాను చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ నా పని నేను చేస్తాను’ అని వ్యాఖ్యానించారు. మహువాను విచారణకు రమ్మంటూ ఈడీ ఇదివరకే రెండు సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె హాజరు కాలేదు.