ఐక్యరాజ్యసమితి, అక్టోబర్ 1: భారత జాతిపిత మహాత్మాగాంధీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ప్రసంగించారు. అవును.. నిజమే.. మహాత్మాగాంధీయే ప్రసంగించారు. ఆదివారం (అక్టోబర్ 2) గాంధీజీ జయంతి. ఆ రోజును ప్రపంచ అహింసా దినోత్సవంగా ఐరాస 2007 నుంచి నిర్వహిస్తున్నది. ఈ ఏడాది ప్రపంచ అహింసా దినోత్సవం సందర్భంగా ఐరాస జనరల్ అసెంబ్లీలో గాంధీజీ నిలువెత్తు హోలోగ్రామ్ను ప్రదర్శించారు. విద్య ప్రాధాన్యతపై మహాత్ముడు 80 ఏండ్ల క్రితం చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు చేస్తున్నట్టుగా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమాన్ని యునెస్కో, ఐరాసలోని గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (ఎంజీఐఈపీ) సంయుక్తంగా నిర్వహించాయి. ‘విద్య ఒకచోట మొదలయ్యేది కాదు.. ఒకచోట ముగిసేది కాదు. విద్యార్థిని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించేదే విద్య. శరీరం, మనసు, ఆత్మకు శిక్షణ ఇవ్వటమే విద్య. విద్య అంటే హృదయం’ అని గాంధీ అన్న మాటలను వాయిస్ ఓవర్ ద్వారా వినిపించారు.