యాదాద్రి, మే 12: యాదాద్రీశుడి దివ్య క్షేత్రాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. చక్కటి నిర్మాణాలతో యాదాద్రి రూపుదిద్దుకున్నదని అభిప్రాయపడ్డారు. గురువారం ఆయన యాదాద్రి స్వయంభూ మూర్తులను దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. ప్రధానాలయ ముఖమండపంలో వేద పండితులు, అర్చకులు, వేదమంత్రాలు పఠనం చేశారు. అనంతరం ముఖ మండపంలో స్వామి ప్రవచనం చేశారు.
తెలంగాణ ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై చక్కటి నిర్ణయాలు తీసుకుంటుందని ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాలను యాదాద్రి తరహాలో అభివృద్ధి చేయాలని సూచించారు. తెలంగాణలో యాదాద్రి ఆలయం ఉండటం గొప్ప విశేషం అన్నారు. ప్రజలందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం యాదాద్రికొండపై పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వెంట ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ప్రధానార్చకుడు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు ఉన్నారు.