ఊట్కూర్, మే 18: మండలంలోని తిప్రాస్పల్లి అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన సీసీరోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా సర్పంచ్ సుమంగళ కృషి చేస్తున్నారు. గ్రామంలో సీసీరోడ్లు, సైడుకాల్వలు ‘పల్లె ప్రగతి’కి చిహ్నంగా నిలుస్తున్నాయి. కొన్నిరోజుల కిందట ఆర్అండ్బీ రోడ్డు నుంచి కొత్త గేరికి వెళ్లేందుకు ప్రజలకు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉండేది.
ఇటీవల జీపీ నిధులు రూ.10లక్షలతో 16ఫీట్ల వెడల్పుతో సీసీ, రోడ్డుకు ఇరువైపులా రూ.8లక్షల వ్యయంతో సైడు కాల్వలు నిర్మించి ప్రజల ఇబ్బందులను తొలగించారు. ఈ క్రమంలోనే స్థానిక ఎస్సీ కాలనీ, బాపురంలో సీసీ, సైడ్ కాల్వల పనులు సాగుతున్నాయి. గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజల సహకారం అవసరమని, స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్ధే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని సర్పంచ్ కోరుతున్నారు.